ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోట కడప గడపలో పసుపు జెండా రెపరెపలాడాలని సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చేసుకున్నారు. అంతేగాక మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు. ప్రస్తుతం ఈ మంత్రికి, ఆ ప్రాంతానికి చెందిన ఎంపీకి మధ్య విభేదాలు రగులుతున్నాయి. ఆది చేరికను వ్యతిరేకిస్తున్న రామసుబ్బారెడ్డి వర్గంతో ప్రస్తుతం అధిష్ఠానానికి ముచ్చెమటలు పడుతుంటే.. ఇప్పుడు మంత్రి-ఎంపీ వార్ గోరుచుట్టు మీద రోకలి పోటులా మారింది. పార్టీని పటిష్టం చేయాల్సింది పోయి.. నిత్యం ఫిర్యాదులు.. పంచాయితీలతో ఇద్దరూ అధినేత చుట్టూ తిరుగుతున్నారు.
మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మధ్యవిభేదాలు ముదిరిపోయాయి. వీరి మధ్య పంచాయితీలు చేయలేక.. అధినేత చంద్రబాబు విసిగివేశారిపోతున్నారు. కడపలో ఇప్పటికే ఉన్న విభేదాలకు తోడు వీరిది కూడా తోడవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సీఎం రమేష్, మంత్రి ఆదినారా యణరెడ్డి మధ్య విభేదాలకు కారణం కాంట్రాక్టు పనులే. గాలేరు-నగరి సుజల స్రవంతి పనులను సీఎం రమేష్ కు చెందిన కాంట్రాక్టు సంస్థ చేస్తోంది. వీటిని పట్టుబట్టి తన సంస్థకే సీఎం రమేష్ కేటాయించుకున్నారు. అయితే పనులు మందకొడిగా సాగుతున్నాయి. వాటిని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తుండటాన్ని ఆది తట్టుకోలేకపోయారు.
సీఎం రమేష్ పై మంత్రి ఆదినారాయణరెడ్డి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు సీఎం రమేష్ కు ఫోన్ చేసి పనులపై ఆరాతీశారు. దీంతో సీఎం రమేష్ కు చిర్రెత్తుకొచ్చింది. తన అనుచరులకు ఆదినారాయణరెడ్డి చేస్తున్న పనులపై ఆరా తీయాలని పురమాయించారు. ఇసుక అక్రమ రవాణాపై నిజాయితీగా విధులు చేస్తున్న కడప ఎస్పీపై ఆదినారాయణ రెడ్డి చేసిన ఆరోపణలను, మార్క్ ఫెడ్ యంత్రాంగంపై వచ్చిన ఆరోపణలను మంత్రి అనుచరులు సొమ్ము చేసుకోవడంపై వీరు ఆధారాలు సేకరిస్తున్నారు. దీనిపై ఆదినారాయణరెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు సీఎం రమేష్ సిద్ధమవుతున్నారు. ఇక సీఎం రమేశ్కు కడప నేతలతో పొసగడం లేదనే వాదన వినిపిస్తోంది.
కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి, సీఎం రమేష్ కు మధ్య కూడా విభేదాలు తీవ్రంగానే తలెత్తాయి. ఒకరు పాల్గొన్న సమావేశంలో మరొకరు పాల్గొనలేనంతగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయాలని సీఎం రమేష్ భావిస్తున్నారు. అందుకే సీఎం రమేష్ వ్యతిరేకిస్తున్నాపార్టీ పగ్గాలు శ్రీనివాసులురెడ్డికే చంద్రబాబు అప్పగించారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు, మంత్రి ఆదినారాయణ మధ్య విభేదాలు కూడా బయటపడ్డాయి. ఇలా వరుసగా విభేదాలు, కుమ్ములాటలు ఉండటంతో సీఎం చంద్రబాబు ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.