ఏపీలో విపక్షంగా వ్యవహరించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీ నేత జగన్.. ఇప్పుడు కొన్ని రోజులుగా అంటే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరిగిన తర్వాత నుంచి జగన్ కంఠం మూగపోయింది. ఏపీలో ప్రజలు ఉన్నారని, వారు ప్రస్తుతం వివిధ సమస్యల్లో చిక్కుకుపోయారని కూడా ఆయన గుర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా గడిచిన వారంలో రాష్ట్రం రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంది. తూర్పుగోదావరి జిల్లా చాపరాయిలో మరణాలు, పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితుల బహిష్కరణ.
ఈ రెండు సంఘటనలు పెద్ద ఎత్తున కుదిపేశాయి. వీటిపై పోరాటం చేసి .. ప్రజలకు న్యాయం చేయాల్సిన విపక్షం హైదరాబాద్కే పరిమితమైపోయింది. ఒక్క మాటంటే ఒక్కమాట కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టలేకపోయింది. అంతేకాదు, జగన్ హైదరాబాద్ సరిహద్దులు దాటి ఏపీలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకోలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. జగన్ తీరు చూస్తే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుకు చంద్రబాబు లోపాయికారీగా మద్దతిచ్చినట్లు ఉంటోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
టీడీపీ ప్రజావ్యతిరేకత తమకే లాభిస్తుంది కాబట్టి టీడీపీని విమర్శించకపోయినా పర్లేదని జగన్ శిబిరం భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా తాజా రెండు ఘటనల్లోనూ అమాయకులు బలైపోయారు. వీరికి అండగా ఉండాల్సిన విపక్షం కనీసం కన్నెత్తి చూడలేదు. పన్నెత్తి పలకరించలేదు. దీంతో వైసీపీ అధినేతపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. బాబు సర్కారుకి జగన్ మద్దతిస్తున్నాడా? అని జనాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి జగన్ ఇప్పటికైనా ఏపీలో జనాలున్న సంగతి, ఇక్కడ తన ఉద్యోగం సంగతి ఏమైనా గుర్తిస్తాడో లేదో చూడాలి.