కొమ్ములు పెరిగాయ్‌…ఎమ్మెల్యేకు కేసీఆర్ వార్నింగ్‌

పనితీరు మెరుగుప‌రుచుకోవాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్.. టీఆర్ఎఎస్ ఎమ్మెల్యేల‌కు ప‌దే ప‌దే చెబుతుంటారు. ఈ విష‌యంలో త‌న‌కు ఆప్తులైన వారు ఉన్నా.. వారిపై కూడా ఎంతో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు! ఇప్పుడు ఇదే విష‌యం మ‌రోసారి రుజువైంది. త‌న‌కు ఆప్తుడైనా స‌రే.. ఒక ఎమ్మెల్యేపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ ఆయ్యారు. సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. `నీకు కొమ్ములు పెరిగాయి` అంటూ తీవ్ర ప‌ద‌జాలంతో హెచ్చ‌రించారు. తాను అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో ఆ ఎమ్మెల్యే ప‌నితీరు అస్స‌లు బాగాలేద‌ని తేల‌డంతో ఈ స్థాయిలో ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు. దీంతో తోటి ఎమ్మెల్యేలు ఒక్క‌సారిగా ఖంగు తిన్నారు. ఆ ఎమ్మెల్యే మ‌రెవ‌రో కాదు వేముల ప్ర‌శాంత్‌రెడ్డి!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చండీయాగంలో కీలక పాత్ర పోషించారు ప్ర‌శాంత్‌రెడ్డి. అలాగే కేసీఆర్ మాన‌స‌పుత్రిక `మిషన్ భగీరథ` ప్రాజెక్టుకు వైస్ చైర్మన్ గా కేబినెట్ హోదాలో పోస్టులో నియమించారనే ప్రచారం కూడా సాగింది. అంతలా న‌మ్మిన వ్య‌క్తిపై కేసీఆర్ మండిపడ్డారు. తాను చేయించిన సర్వేలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పై సీరియస్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ లో టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

“నీ పనితీరుపై నియోజకవర్గ ప్రజల ఆమోదం డిసెంబర్ లో 62.20 % ఉంటే.. ఇప్పుడు 39.90 % కి పడిపోయింది. పదవి రాగానే అహంకారం, గర్వం, అహంభావం పెరగొద్దు. భగీరథ వైస్ ఛైర్మన్ కాగానే నీకు కొమ్ములు పెరిగినయ్. అప్పటి నుంచి నీ గ్రాఫ్ పడిపోయింది. ఎమ్మెల్యే గా ఉండి ఇసుక దందా చేస్తుంటివి. నీ పద్ధతి ఏం బాగోలేదు. ఇసుక వ్యాపారం చేస్తే ఏం విలువ ఉంటదయా? నువ్వు మళ్ల గెలుసుడు కష్టం“ అని కేసీఆర్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారట. ఇన్నాళ్లూ త‌న విష‌యంలో సాఫ్ట్‌గా ఉన్న సీఎం.. ఒక్క‌సారిగా ఇలా ఫైర్ అయ్యే స‌రికి అవాక్క‌య్యార‌ట‌.

అంతేగాక‌ ప్రశాంత్ రెడ్డి ముఖం మాడిపోయింద‌ట‌. ఇది చూసిన మిగిలిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు షాక్ అయ్యారు. ముఖ్యమంత్రి చేయించిన‌ సర్వేలో ఓడిపోయే ఎమ్మెల్యే ల లిస్ట్ లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నార‌ట‌. మెదక్ జిల్లాలో ల్యాండ్ కబ్జా కేసుపై బట్టాపూర్లో స్టోన్ క్రషర్ పెట్టిన విషయంపై ఇంటలిజెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని సీఎం ఫైర్ అయ్యారని తెలుస్తోంది. అంతేగాక ఈ లిస్టులో గంప గోవర్ధన్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఉన్నార‌ట‌.