తాజాగా జరిగిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రెండు కీలక విషయాలను తెరమీదికి తెచ్చింది. ఒకటి.. మూడేళ్ల జగన్ పరిపాలన తర్వాత.. వచ్చిన తొలి ఎన్నిక.(ఉప ఎన్నికే అయినా ) రెండు.. ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉండడం. ఈ రెండు విషయాలను అధికార పార్టీ తనకు గొప్పగా ప్రచారం చేసుకోవడం.. మామూలే. తమ పథకాలే ఇంత మెజారిటీ వచ్చేలా చేశాయని.. జగన్కు అనుకూలంగా ప్రజలు ఉన్నారని.. పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటారు.
అయితే..ఇదేసమయంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చకుండా చేసి.. అధికారం లోకి వస్తామని.. జనసేన అధినేత పవన్ చెబుతున్నారు. ఇక, జనం ఇప్పటికే.. జగన్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. జగన్ను లోటస్పాండ్కు పంపించేందుకు.. రెడీగా ఉన్నారని.. చెబుతూ.. వచ్చిన టీడీపీ.. ఈ ఆత్మకూరు ఫలితాన్ని ఎలా అన్వయించుకుంటాయి? అనేది ఆసక్తిగా మారింది. లేక.. ఏముంది.. గౌతంరెడ్డి సింపతీ అంతా.. ఓట్ల రూపంలో పడింది! అని లైట్ తీసుకుంటాయా?
ప్రస్తుతం ఈ విషయమే ఆసక్తిగా మారింది. ఇక్కడ ఇలా అనుకున్నా.. అంటే. గౌతంరెడ్డి మృతితో సింపతీ ఓట్లు వచ్చాయని అనుకున్నా.. ఇదే తరహా..(అంటే.. అభ్యర్థి సీఎం అయ్యారు) పోలింగ్ పంజాబ్లోనూ జరిగింది. అక్కడి నంగ్రూర్ లోక్సభ స్థానం నుంచి 2019లో గెలిచిన మాన్.. తర్వాత.. ఆప్ సర్కారు రావడంతో సీఎం అయ్యారు. దీంతో ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. గత మూడు మాసాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఈ క్రమంలో ఖాళీ అయిన.. నంగ్రూర్లో ఉప ఎన్నిక వచ్చింది. సో.. ఇక్కడ ఎవరు గెలవాలి..? “మా నాయకుడు..మా మాజీ ఎంపీ.. మాన్ సీఎం అయ్యాడు కాబట్టి.. ఇక్కడ కూడా ఆప్నే గెలిపించాలి“ అని ప్రజలు అనుకోవాలి. ఆప్ అభ్యర్థిని గెలిపించాలి. పైగా మూడు నెలలుగా మాన్ సీఎంగా రికార్డు సృష్టిస్తున్నారు. కానీ.. ప్రజలు అలా అనుకోలేదు. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ అభ్యర్థిని గెలిపించారు. ఏతావాతా చెప్పేది ఏంటంటే.. ప్రజలకు సెంటిమెంటు కన్నా.. తాము ఏమనుకుంటే.. అదే చేస్తారు. కట్ చేస్తే.. ఆత్మకూరులోనూ అదే జరిగిందని అనుకోవాలి.
అంటే.. వైసీపీ మూడేళ్ల పాలన విషయంలో జగన్ వైపే జనం ఉన్నారని.. ఆత్మకూరులో స్పష్టమైంది. ఎక్కడా వ్యతిరేకత లేదని.. కూడా తమ ఓట్ల ద్వారా ప్రజలు చెప్పేశారు. గతంలో ఆత్మకూరులో 53.22 శాతం ఓట్లు దక్కించుకున్న వైసీపీ, తాజా ఉప ఎన్నికలో 74.47 శాతం దక్కించుకుంది. ఇక, ఇదే పరంపర మరో రెండేళ్ల తర్వాతకూడా ఎందుకు కొనసాగదు. అంతేకాదు.. ప్రతిపక్షాలు చెబుతున్నట్టు.. జగన్పై అంత ఆగ్రహమే ప్రజలకు ఉంటే ఇంత పోలింగ్ శాతం నమోదు కాదు.. కదా?! కాబట్టి.. విపక్షాలు ఆత్మ శోధన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.