“రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. అన్నీ ఉచితంగా ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారు. ఇ దేం పాలన“ అంటూ..కొన్ని రోజుల కిందట.. బీజేపీ కేంద్ర మంత్రి ఒకరు రాష్ట్రానికి వచ్చివ్యాఖ్యానించారు .. కట్ చేస్తే.. సోము వీర్రాజు మరింత వర్రీ అయ్యారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు డబ్బులు లేవం టున్న సర్కారు… పథకాల పేరుతో ప్రజలకు పంపకాలు చేస్తోందని నోరు చేసుకున్నారు. ఇక, టీడీపీ నాయకులు కూడా ఇదే బాటలో విమర్శలు సంధించారు. అమ్మ ఒడి, ఇతరత్రా పథకాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. అమ్మ ఒడికి డబ్బులు ఇచ్చేందుకు ఉన్నాయికానీ.. ఫిట్మెంట్ పెంచలేరా? అంటూ.. ప్రశ్నలు సంధించారు.
అయితే.. ఈ పార్టీలు.. నిజంగానే ఉచిత పథకాలకు వ్యతిరేకమా? ప్రజలకు ఉచితం కింద ఏ పథకాన్ని అమలు చేసేందుకైనా వ్యతిరేకమా? అంటే.. అంతా ఆ తాను ముక్కలే అంటున్నారు పరిశీలకులు. గతంలో చంద్రబాబు పాలనలో అయినా.. ఇప్పుడు అతిపెద్ద రాష్ట్రంలో యూపీలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న పంథా అయినా.. ఉచితాల చుట్టూతానే తిరుగుతోందని చెబుతున్నారు. విదేశీ విద్య పేరుతో.. లక్షలకు లక్షలకు.. ఒక వర్గానికి(మంచిదే అయినా) ఇవ్వలేదా? పసుపు-కుంకుమ పేరుతో 16000 కోట్లు అప్పులు తెచ్చి ఎన్నికలకు ముందు పంచలేదా?
మునిసిపల్ కార్పొరేషన్లలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల ద్వారా.. రూ.70 అయ్యే భోజనాన్ని.. రూ.5కు అందించలేదా? మిగిలిన సొమ్మును ప్రభుత్వం కార్పొరేషన్లకు కట్టలెదా? ఇక, డప్పు కళాకారుల పేరుతో వారికి రూ.3000 పింఛను ఇవ్వలేదా. వాస్తవానికి అప్పటి వరకు వారు కష్టాన్ని నమ్ముకున్నారు. మరి ఇవి ఉచితాలు.. పంపకాలు కావా?! కాకపోతే.. ఇప్పుడు మరింత మందికి లబ్ధి చేకూరుస్తున్నారు అంతే! ఇక, బీజేపీ విషయాన్ని చూస్తే.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలకమైన అస్త్రాన్ని బయటకు తీసింది. తొలి దశ పోలింగ్కు సరిగ్గా రెండు రోజుల ముంగిట మ్యానిఫెస్టోను విడుదల చేసింది.
దీనిలోనూ అనేక ఉచితాలు ప్రవేశ పెట్టింది. అసలు కేంద్ర మంత్రులుకానీ, ప్రధాని కానీ.. ఎక్కడ నోరు విప్పినా..ఉచితాలకు తాము వ్యతిరేకమనిచెబుతుంటారు. కానీ, తాజాగా యూపీలో ఇచ్చిన మేనిఫెస్టోను పరిశీలిస్తే.. ఎన్ని ఉచితాలు ఇస్తున్నారో తెలుస్తుంది. ‘లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర-2022’ పేరిట రూపొందించిన మ్యానిఫెస్టోలో కుటుంబానికో ఉద్యోగం ఇస్తామని బీజేపీ తెలిపింది. రానున్న ఐదేళ్ల పాటు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది.
చెరకు రైతులకు 14 రోజుల్లో బిల్లులు చెల్లించేలా చూస్తామని.. ఆలస్యమైతే మిల్లుల యజమానుల నుంచి వడ్డీ వసూలు చేసిస్తామని పేర్కొంది. ప్రతిభావంతులైన విద్యార్థినులకు స్కూటర్లు, విద్యార్థులకు రెండు కోట్ల ట్యాబ్లు, స్మార్ట్ఫోన్లు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించింది. అంతేకాదు.. ఆటోవాలాలకు నెలల మూడు లీటర్ల పెట్రోలు. టూ వీలర్ వున్నవారికి నెలకు ఓ లీటరు.. అమ్మాయిలకు ఉచిత విద్య, దిగువ కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. మరి దీనిని ఏమంటారు?
ఇప్పుడు జగన్ చేస్తున్న పంపకాలను ప్రశ్నిస్తున్న బీజేపీ గొంతులు.. టీడీపీ గళాలు.. దీనిని వ్యతిరేకించగలరా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. 2042 ఎన్నికల్లో ఏపీలో ఎలాంటి ఉచిత హామీ లేకుండా.. బీజేపీ కానీ, టీడీపీ కానీ, బరిలో నిలచే ధైర్యం స్థయిర్యం చేయగలవా? అని నిలదీస్తున్నారు. మరి దీనికి నాయకులు ఏమంటారో చూడాలి.