రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు.
ఇక ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఇటీవల విడుదల చేసిన రాధేశ్యామ్ టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. యూట్యూబ్లో విడుదలైన కొన్ని గంటల్లోనే కోట్లలో వ్యూస్ కొల్లగొట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే తాజాగా రాధేశ్యామ్కు ఊహించని దెబ్బ తగిలింది. ఇంతకీ ఏం జరిగిందంటే యూట్యూబ్లో ‘రాధేశ్యామ్’ టీజర్ వ్యూస్ ఒక్కసారిగా తగ్గిపోయాయి.
ఏదో ఒకటో రెండో వ్యూస్ కావు.. ఏకంగా ముందు కనిపించిన వ్యూస్ కంటే మిలియన్ వ్యూస్ తగ్గాయి. దాంతో ఏం జరిగిందో తెలియక డార్లింగ్ ఫ్యాన్స్ యూ ట్యూబ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ టీమ్ వెంటనే స్పందిస్తూ.. యూ ట్యూబ్ను వ్యాలిడేట్ చేశామని, దాని వల్ల అప్పటి వరకు ఉన్న వ్యూస్ కాస్త తగ్గడం లేదా ఫ్రీజ్ కావడం కానీ జరుగుతాయని సమాధానం ఇచ్చింది. ఇక టెక్నికల్ రీజన్ కావడంతో ఫ్యాన్స్ శాంతించారు.