ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి.
గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్లో 16,156 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,31,809 కు చేరుకుంది. అలాగే నిన్న 733 మంది కరోనా కారణంగా మృత్యువాత పడగా.. దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,56,386 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 17,095 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,36,14,434 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్రస్తుతం 1,60,989 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.