దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదనేది సామెత… ఇప్పుడు ఈ సామెత ప్రస్తుత ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనితకు సరిగ్గా సరిపోతుంది. ఐదేళ్ల పాటు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కొనసాగిన సమయంలో నానా మాటలు పడ్డారు. ఇక ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు కూడా. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగు మహిళలు ఎంతో అండగా నిలిచారు. కించపరిచేలా అనితపై వైసీపీ ట్రోలర్స్ పోస్టులు పెట్టినప్పుడు కూడా అనితకు అండగా నిలిచింది తెలుగు మహిళలే. ఇక అనిత పాయకారావుపేట నుంచి పోటీ చేస్తున్నప్పుడు కూడా ఆమె గెలుపు కోసం ఎంతో శ్రమించారు. సొంత నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూనే… అనిత గెలుపు కోసం కూడా పాయకారావుపేట నియోజకవర్గంలో ప్రచారం చేశారు కొందరు నేతలు. ఇక ఫలితాల అనంతరం… వంగలపూడి అనితకు అనూహ్యంగా హోమ్ మంత్రి పదవి దక్కింది. దీంతో తమ నేత కదా అని భావించిన వారందరికీ ఇప్పుడు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.
నిన్నటి వరకు మేడమ్ వెంట తిరిగిన వారిని ఇప్పుడు పూజారి అడ్డుకుంటున్నాడనే మాట అటు పార్టీ నేతల్లో, ఇటు కార్యకర్తల్లో కూడా బలంగా వినిపిస్తోంది. ఆ పూజారి ఎవరో కాదు… నిత్యం ఆమె వెంట ఉండే పీఏ జగదీష్. అనిత దగ్గర దాదాపు 5 ఏళ్లుగా పని చేస్తున్న పీఏ జగదీష్… ప్రతిపక్షంలో ఒకలా… అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అందరికీ ఫోన్లు చేసి మరీ కార్యక్రమాల గురించి చెప్పి… కవరేజ్ కోసం మీడియాకు సమాచారం ఇచ్చి… నేతలను, కార్యకర్తలతో ఎంతో గౌరవంగా ఉన్నాడు. అయితే పదవి వచ్చిన తర్వాత మాత్రం జగదీష్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. చివరికి పార్టీ ముఖ్యనేతలు ఫోన్ చేసినా కూడా సమాధానం ఇవ్వటం లేదు. ఇక గుంటూరు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మితో కలిసి నిన్నటి వరకు మేడం గెలుపు కోసం పని చేసే వారి మీదే పాలిట్రిక్స్ ప్లే చేస్తున్నాడట జగదీష్. మేడం గారిని కలిసేందుకు ఎవరైనా వస్తే… బిజీగా ఉన్నారంటూ దూరం పెడుతున్నారు. ఇందులో జయలక్ష్మి పాత్ర కూడా ఉందటునే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగదీష్ దంపతుల మేడం గారి ఇంట్లోనే ఉంటున్నారు. అనితతో ఏదైనా పని కావాలని వెళ్లిన వారు ముందు పీఏ జగదీష్, అన్నాబత్తుని జయలక్ష్మి అనుమతి తీసుకోవాల్సిందే. మేడం ఫోన్ చేసి రమ్మన్నారని చెప్పినా సరే… మాకు చెప్పలేదే… అని బ్రేకులు వెస్తున్నారు.
చివరికి ఐదేళ్లుగా మేడం కోసం పని చేసిన రాష్ట్రస్థాయి నేతలకు కూడా ఇప్పుడు ఆమె అపాయింట్మెంట్ లభించటం లేదంటున్నారు పార్టీ నేతలు. చివరికి హోమ్ మంత్రితో ఏదైనా పని మీద ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా సరే… ఆ ఫోన్ పీఏ తీయడం లేదంట. ఇదే విషయాన్ని ఇప్పటకే పలువురు నేతలు స్వయంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మేడం గారికి లేని ఇబ్బందులు… మధ్యలో ఉన్న జగదీష్, జయలక్ష్మిలకు ఎందుకు అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోమ్ మంత్రితో ఎవరైనా తెలుగు మహిళా నేతలు కలిస్తే.. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రాకుండా జగదీష్ చాలా జాగ్రత్తలు పడుతున్నారు. అదే సమయంలో జయలక్ష్మి ఫోటోలు మాత్రం అనిత పక్కనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిద్దరికి వంకినేని కృష్ణ కూడా తోడయ్యాడనేది మరో ఆరోపణ. మేడంతో మాట్లాడాలంటే అదో ప్రస్తానమే అంటున్నారు టీడీపీ నేతలు. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదనే విమర్శలు ఇప్పుడు హోమ్ మంత్రి వంగలపూడి అనిత గురించి వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిని దూరం పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో ఇబ్పందులు తప్పవంటున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు.