ఏపీ రాజకీయాల్లోకి కొత్త నేతలు రాక…!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాటల్లో వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి సంకేతాలు కూడా అందాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించేస్తోంది అధికార వైసీపీ. గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్న ప్రతిపక్షాలు కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేశాయి. టీడీపీ-జనసేన పొత్తు ఖరారు కావడంతో… రెండు పార్టీల అధినేతలు ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు కొత్త నేతలు ఆసక్తి చూపుతున్నారు.

తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో 23 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. వారిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నారు. మిగిలిన 19 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరోసారి గెలుస్తుందని సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గం నుంచి యార్లగడ్డ వెంకట్రావును బరిలో దింపనున్నారు. ఇక రాజధాని ప్రాంతమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతివ్వడంతో… ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపు దిశగా… చంద్రబాబు పావులు కదుపుతున్నారు.

రాజకీయాలకు ఏ మాత్రం పరిచయం లేని ఓ మహిళా పారిశ్రామిక వేత్తను టీడీపీ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా డెయిరీ వ్యాపారంలో రాణిస్తున్న శ్రీ సురభి మిల్క్ చైర్ పర్సన్ వీఆర్ లక్ష్మీ శ్యామలను ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యాపార రంగంలో రాణిస్తున్న లక్ష్మి శ్యామల… కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ సురభి మిల్క్ ద్వారా పాడి రైతులకు అండగా నిలిచారు. డెయిరీ వ్యాపారంలో టాప్ 5 సంస్థల్లో ఒకటిగా ఉన్న శ్రీ సురభి… పాడి రైతుల మన్ననలు పొందింది. అదే సమయంలో సురభీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలను లక్ష్మీ శ్యామల నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆధ్యాత్మిక భావాలతో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జీర్ణోద్దారణలో ఉన్న పలు ఆలయాలను పునర్నించారు కూడా. దాదాపు 15 ఏళ్లుగా డెయిరీ వ్యాపారంలో రాణిస్తున్న లక్ష్మి శ్యామల… వివిధ వ్యాపారాల్లో సైతం పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యారు.

గతేడాది నవంబర్ నెలలో చంద్రబాబు శ్రీ పెరంబదూర్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటే ఉన్న లక్ష్మి శ్యామలతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. సౌమ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి శ్యామలతో ఇప్పటికే పలు దఫాలు పార్టీ కీలక నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మంత్రి విడుదల రజినిని ఇంఛార్జ్ గా నియమించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళను పోటీలో నిలబెడితే… గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఎవరో తెలియాలంటే… ఈ నెల 18 వరకు ఆగాల్సిందే.