అసలే పెద్దగా సినిమాలు ఆడని బ్యాడ్ టైములో బాలీవుడ్ ని ఓ అంశం మరింత కిందకి నెట్టేసిందని పలువురు సినిమా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అదే బెట్టింగ్ యాప్ కేసు. అవును, గత కొన్ని రోజులుగా బి టౌన్లో ఈ కేసు విషయమై చాలా మంది సినీ తారల పేర్లు బయటకు వస్తున్నాయి. పొగబెడితే ఎక్కడెక్కడో దాగి వున్న ఎలుకలు బయటకు వచ్చినట్టు ఇప్పుడు “మహదేవ్ బెట్టింగ్ యాప్” కేసులో మరికొంత మంది తారల పేర్లు వెలుగులోకి వచ్చాయి.
ఈపాటికే ఈ బెట్టింగ్ కేసులో ఈడీ స్టార్ హీరో రణ్బీర్ కపూర్కు సమన్లు జారీ చేసిన సంగతి విదితమే. కాగా ఇప్పుడు మరి కొందరు తారలకు సమన్లు అందాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వాటిలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ, నటి హుమా ఖురేషి, హీనా ఖాన్ అలాగే శ్రద్ధా కపూర్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. అక్టోబర్ 4న రణబీర్ కపూర్కు సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు, ఇప్పుడు కపిల్ శర్మ, హుమా ఖురేషీ, శ్రద్ధా కపూర్, హీనా ఖాన్లకు సమన్లు పంపినట్లు సమాచారం. కాగా సన్నీలియోన్, కృష్ణ అభిషేక్, పుల్కిత్ సామ్రాట్ సహా ఇంకా 14 మంది తారలు ఈడీ రాడార్లో ఉన్నారని గతంలో కూడా వార్తలు రావడం కొసమెరుపు.
ఇకపోతే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ప్రధాన నిందితుళ్ళో ఒకరైన సౌరభ్ చంద్రకర్ వివాహానికి ఆయా తారలందరూ హాజరైనట్టు అధికారులు కనుగొన్నారు. అయితే ఆ 14 మంది లిస్టులో కపిల్, హుమా, శ్రద్ధా, హీనా పేర్లు లేవు. కానీ ఇప్పుడు ఈ నలుగురికి కూడా సమన్లు పంపించారు అధికారులు. దాంతో ఈ విషయం సర్వత్రా పెను సంచలంగా మారింది. ఇక రణబీర్ కపూర్ను అక్టోబర్ 6న విచారణకు హాజరుకావాలని అధికారులు కోరగా రణబీర్ ఈడీ నుంచి రెండు వారాల సమయం కోరారు. ఇక ఇప్పుడు ఈ కేసులో కపిల్ శర్మ, హుమా ఖురేషి, శ్రద్ధా కపూర్ , హీనా ఖాన్ పేర్లు వినబడడంతో ఇప్పుడు బాలీవుడ్ లో గందరగోళం నెలకొంది.