దళపతి విజయ్ `లియో` మూవీ మరో రెండు రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మాస్టర్ తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న విజయ్.. లియోతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాలని మంచి కసి మీద ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటించింది.
సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మితమైన లియో.. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంచనాలు భారీగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా లియో ఓపెనింగ్స్ భారీగా ఉండనున్నాయని సినీ పండితులు బలంగా చెబుతున్నారు. ఇదే తరునంలో లియో మూవీకి తెలుగులో బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ కు కోత పడింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టడానికి లియో సినిమా పర్ఫెక్ట్ అని భావించి ఆ మూవీ తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ముందు రూ. 18 కోట్లకు డీల్ మాట్లాడుకుని.. భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. కానీ, తెలుగులో పోటీగా భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు ఉండటంతో లియోకు అనుకున్న రేంజ్ లో బజ్ ఏర్పడలేదు. బుక్కింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో లియో నిర్మాతలతో అనేక చర్చలు జరిపి.. థియేట్రికల్ రైట్స్ కు రెండు కోట్లు తగ్గించేలా చేశారట నిర్మాత నాగ వంశీ. ఫైనల్ గా రూ. 16 కోట్లకు తిరిగి రీ ఎగ్రిమెంట్ చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్ కు ఇది అవమానమని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.