మ‌హేష్ మూవీకి ముహూర్తం పెట్టేసిన రాజ‌మౌళి.. `SSMB29` పట్టాలెక్కేది ఎప్పుడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుంటూరు కారం అనంతరం మహేష్‌ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం ప్రారంభించబోతున్నాడు. మహేష్‌ కెరీర్‌లో రాబోతున్న 29వ చిత్రమిది.

అలాగే రాజ‌మౌళి, మ‌హేష్ బాబు కాంబోలో వ‌స్తున్న ఫ‌స్ట్ ప్రాజెక్ట్ కావ‌డంతో అభిమానుల్లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ సినిమాకు క‌థ అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీని స్టార్ట్ చేయ‌డానికి రాజ‌మౌళి ముహూర్తం పెట్టేశార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే జ‌క్క‌న్న స్టోరీని ఫైన‌ల్ చేసి.. స్క్రిప్ట్ ను కంప్లీట్ చేశాడు. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల‌న్నీ ఆల్మోస్ట్ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. లొకేషన్లు ఫైనల్ చేయడం, స్టోరీబోర్డులు సిద్ధం చేయడంలాంటివి కూడా పూర్తి అయ్యాయ‌ట‌. ఈ నేపథ్యంలోనే `SSMB29` ను పట్టాలెక్కించేందుకు ముహూర్తం పెట్టేసుకున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది మార్చి నెల‌లో గ్రాండ్ గా రాజ‌మౌళి-మ‌హేష్ బాబు సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ గ్యాప్ లో రాజ‌మౌళి న‌టీన‌టుల ఎంపిక కూడా ఫినిష్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నట్లు స‌మాచారం.