ఈ దసరా పండగకు టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన `భగవంత్ కేసరి` అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు రవితేజ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొదిద్దుకున్న `టైగర్ నాగేశ్వరరావు` మూవీ అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
ఈ రెండు సినిమాలపై భారీ అంజనాలు నెలకొన్నాయి. బిజినెస్ కూడా అదిరిపోయే లెవెల్ లో జరుగుతోంది. అయితే బాక్సాఫీస్ వద్ద బాలయ్య, రవితేజ పోటీ పడటం ఇదేమి తొలిసారి కాదు. గతంలో మూడుసార్లు ఈ ఇద్దరు హీరోల మధ్య ఫైట్ నడిచింది. మొట్టమొదట 2008 సంక్రాంతికి బాలకృష్ణ ఒక్కమగాడు, రవితేజ కృష్ణ సినిమాలు రిలీజయ్యాయి. అయితే కృష్ణ సినిమా హిట్ అవ్వగా.. ఒక్కమగాడు ఫ్లాప్ అయింది.
ఆ తర్వాత 2009లో వారం రోజుల గ్యాప్ లో బాలకృష్ణ మిత్రుడు, రవితేజ కిక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. మిత్రడు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే.. కిక్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక 2011లో రవితేజ మిరపకాయ్, బాలకృష్ణ పరమవీరచక్ర సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. వీటి ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిరపకాయ్ హిట్ అవ్వగా.. పరమవీరచక్ర అట్టర్ ఫ్లాప్ అయింది. అలా మూడు సార్లు బాలయ్యతో పోటీ పడి రవితేజానే గెలిచాడు. ఇదే సెంటిమెంట్ మరోసారి రిపీటైతే 2023 దసరా విన్నర్ రవితేజానే అవుతాడని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మరి గెలుపు ఎవరిదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.