గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇటీవల విడుదలైన `జైలర్` మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. రమ్యకృష్ణ, తమన్నా, మోహన్ లాల్, శివరాజ్కుమార్, జాకీష్రాఫ్ వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు.
అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి స్వరాలు అందించాడు. ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి ఆట పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. వసూళ్ల వర్షం కురిపించింది. 700 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓటీటీలో కూడా భారీ వ్యూస్ లోను సాధించి రికార్డులు తిరగరాసింది. ఈ మూవీతో రజనీకాంత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. జైలర్ గ్రాండ్ సక్సెస్ తో నిర్మాత కళానిధి మారన్ చిత్ర టీమ్ మొత్తానికి గిఫ్ట్స్ ఇచ్చారు.
అయితే చాలా మందికి తెలియని విజయం ఏంటంటే.. జైలర్ మూవీకి ఫస్ట్ ఛాయిస్ రజనీకాంత్ కాదు. నెల్సన్ దిలీప్ కుమార్ మొదట ఈ సినిమాను ఓ తెలుగు హీరోతో చెయ్యాలని అనుకున్నాడు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. జైలర్ కథ కు చిరంజీవికి నెరేట్ కూడా చేశాడట. కానీ, అప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో నో చెప్పారు. అలా చిరంజీవి నుంచి చేజారిన జైలర్.. రజనీకాంత్ ఖాతాలో బ్లాక్ బస్టర్ గా వచ్చి పడింది. ఇక జైలర్ మూవీని చిరంజీవి మిస్ చేసుకున్నారని తెలియగానే మెగా ఫ్యాన్స్ గగ్గోలు పెట్టేస్తున్నారు.