కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక ఇటీవల ముంబైకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తితో కలిసి సూర్య చెన్నైలో ఉండేవారు. వీరిది ఉమ్మడి కుటుంబం. పెళ్లి చేసుకున్న తర్వాత సూర్య, కార్తి తమ తండ్రి నుంచి విడిపోకుండా.. అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. కానీ, కొన్ని నెలల క్రితం అనూహ్యంగా సూర్య, జ్యోతిక దంపతులు ముంబైలోకి వేరు కాపురం పెట్టారు.
ఆ సమయంలో రకరకాల వార్తలు వచ్చాయి. తండ్రి, తమ్ముడితో పడకే సూర్య ముంబైకి వెళ్లిపోయాడని.. ఉమ్మడి కుటుంబం నుంచి సపరేట్ అవ్వడానికి ప్రధాన కారణం జ్యోతికే అని ప్రచారం జరిగింది. కానీ, ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. తాజాగా సూర్య-జ్యోతిక వేరు కాపురంపై కార్తి స్పందిస్తూ కొంచెం ఎమోషనల్ అయ్యారు. జ్యోతికను తాను ఎప్పుడూ నటిగా చూడలేదని.. ఒక అమ్మలానే భావించానని కార్తి పేర్కొన్నాడు.
ప్రస్తుతం అమ్మ ముంబైలో ఉండటం వల్ల మా ఇల్లాంతా బోసిపోయిందని.. నిజానికి ఇన్నేళ్లు మేమంతా కలిసి ఉండటానికి జ్యోతికనే కారణమని కార్తి వెల్లడించారు. ఇప్పుడు పిల్లల చదువుల కోసం అన్నా, వదిన ముంబైకి షిఫ్ట్ అయ్యారు.. మేము విడివిడిగా ఉండటానికి కారణం అదే అని తెలిపారు. అంతేకాదు పిల్లల చదువులు పూర్తైన వెంటనే మళ్లీ మేమంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటామని.. అలాగే ఈలోపు ఏ పండగ వచ్చినా కలుస్తామని కార్తి చెప్పుకొచ్చాడు. దీంతో సూర్య ఫ్యామిలీతో ఎలాంటి విభేదాలు లేవని తేలిపోయింది. సూర్య-జ్యోతిక వేరు కాపురం పెట్టడానికి మెయిన్ రీజన్ పిల్లల చదువులే అని కార్తి వ్యాఖ్యలతో స్పష్టమైంది.