ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా…ఏపీ రాజకీయాల్లో మరింత ఫైర్ చూపిస్తున్నారు. టిడిపి, జనసేనల టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్లపై తనదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ఇక వారు జగన్ని ఏం చేయలేరన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు జీవితంలో వారు గెలవడం, అధికారంలోకి రావడం కష్టమన్నట్లు చెప్పుకొస్తున్నారు.
తాజాగా కూడా లోకేష్, నగరి టిడిపి ఇంచార్జ్ గాలి భాను ప్రకాష్లని ఉద్దేశించి రోజా ఫైర్ అయ్యారు. ఒకడేమో మంగళగిరి పప్పు అని, మరొకడు నగరి పప్పు అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్కు లభిస్తోన్న ప్రజాదరణ చూసి పవన్ కల్యాణ్కు కడుపు రగిలిపోతున్నట్లు కనిపిస్తోందని, ఈ కడుపుమంటతోనే పవన్ పోతాడేమోనని భయమేస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీలో కడుపు మంటల పవన్ కల్యాణ్ అనే ప్రొసిజర్ కింద ఆయనను చేర్పించి కడుపుమంట తగ్గించాలని కోరుతామని ఎగతాళి చేశారు. అయితే రోజా అధికారంలో ఉండటంతోనే ఇలా మాట్లాడుతున్నారని, రేపు అధికారం పోయాక అప్పుడు పరిస్తితి ఏంటో తెలుస్తుందని టిడిపి, జనసేన శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.
శాశ్వతంగా వైసీపీ అధికారంలో ఉంటుందని, రోజా నగరి నుంచి గెలుస్తారని భావిస్తున్నారని, కానీ ఆ పరిస్తితి లేదని ఫైర్ అవుతున్నారు. అయితే రోజా కాస్త గెలుపుపై కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారని చెప్పవచ్చు. మరి అందుకు తగ్గట్టే నగరిలో పరిస్తితులు ఉన్నాయా? అంటే చెప్పడం కాస్త కష్టమే. గత రెండు ఎన్నికల్లో కూడా ఆమె స్వల్ప మెజారిటీలతోనే గెలిచి బయటపడ్డారు. ఈ సారి ఆ మెజారిటీలు కూడా డౌటే అని సొంత పార్టీ వాళ్ళు అంటున్నారు.
పైగా నగరిలో రోజాకు సొంత పార్టీ వాళ్లే యాంటీగా ఉన్నారు. ఆమెకు సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో రోజా మరోసారి నగరిలో గెలవడం అనేది కాస్త కష్టమైన విషయమే. అయితే జగన్ గాలి, పార్టీ బలం బట్టి ఆమె మళ్ళీ బయటపడే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ సారి నగరిలో ఏం అవుతుందో.