రామ్ చ‌ర‌ణ్‌-ప్ర‌భాస్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌.. స్వ‌యంగా అనౌన్స్ చేసిన రెబ‌ల్ స్టార్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, గ్లోబ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ఓ మ‌ల్టీస్టార‌ర్ రాబోతోంది. అభిమానుల‌కు పిచ్చ కిక్ ఇచ్చే ఈ గుడ్ న్యూస్ ను రెబ‌ల్ స్టార్ స్వ‌యంగా అనౌన్స్ చేశాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ అమెరికాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. `శాన్ డియాగో కామిక్ కాన్` ఈవెంట్ కోసం ఆయ‌న అమెరికా వెళ్లారు. ఈ ఈవెంట్ లో ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో తెర‌కెక్కుతున్న ప్రాజెక్ట్-కె టైటిల్ మరియు ఫ‌స్ట్ గ్లింప్స్ ను లాంచ్ చేశారు.

`క‌ల్కి 2829 ఏడీ` అనే టైటిల్‌ను ఈ సినిమాను ఖరారు చేశారు. కల్కి ఫ‌స్ట్ గ్లింప్స్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అంత అద్భుతంగా గ్లింప్స్ ను క‌ట్ చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌, విజువ‌ల్స్ నెక్స్ట్ లెవ‌ల్ అని చెప్పుకోవాలి. అయితే టైటిల్ గ్లింప్స్ లాంఛింగ్ సంద‌ర్భంగా చిత్ర టీమ్ అమెరికాలో ఓ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో ప్ర‌భాస్‌, క‌మ‌ల్ హాస‌న్‌, నాగ్ అశ్విన్ తో పాటు రానా కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా వారు అనేక విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్ర‌భాస్‌.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, రామ్ చ‌ర‌ణ్‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇండియాలో ఉన్న అద్భుత‌మైన ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి ఒక‌ర‌ని.. ఆయ‌న తీసిన ఆర్ఆర్ఆర్ లోని సాంగ్ కు ఆస్క‌ర్ రావ‌డం భార‌తీయులు గ‌ర్వించ‌త‌గ్గ విష‌య‌మ‌ని ప్ర‌భాస్ పేర్కొన్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ త‌న‌కు మంచి ఫ్రెండ్ అని.. అన్నీ క‌లిసొస్తే ఇద్ద‌రం ఖ‌చ్చితంగా ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తామ‌ని ప్ర‌భాస్ స్వ‌యంగా పేర్కొన్నాడు. నిజంగా అదే గ‌నుక జ‌రిగింది ఇటు మెగా అటు రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసేసుకుంటారు.