లావ‌ణ్య త్రిపాఠిపై అల్లు అర‌వింద్ సెటైర్‌.. మావాడికే ఎస‌రు పెట్టిందంటూ కామెంట్స్‌!

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటికి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో దాదాపు ఏడేళ్ల నుంచి రహస్యంగా ప్రేమాయ‌ణం నడిపిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు అతనితోనే ఏడడుగులు వేసేందుకు సిద్ధం అవుతుంది. జూన్ 9వ తేదీన హైదరాబాద్లోని నాగబాబు నివాసంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్‌ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.

మరికొద్ది రోజుల్లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో వీరిద్దరూ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా లావణ్య త్రిపాఠి పై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ‌తంలో `చావు కబురు చల్లగా` మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. `ఎక్కడో నార్త్ ఇండియా నుండి వచ్చి తెలుగు నేర్చుకొని బాగా మాట్లాడుతున్నావు. ఇక్కడే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో సరిపోతుంది` అని లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి మాట్లాడారు.

క‌ట్ చేస్తే.. ఆయన ఫ్యామిలీకే చెందిన వరుణ్ తేజ్ కే లావ‌ణ్య ఎస‌రు పెట్టింది. ఇదే విష‌యాన్ని బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గోన్న అల్లు అర‌వింద్‌.. గుర్తు చేసుకున్నారు. `నేనేదో సరదాగా చెబితే లావణ్య త్రిపాఠి సీరియస్ గా తీసుకుంది. ఏకంగా మావాడినే పెళ్లి చేసుకోబోతోంది` అంటూ ఆమెపై న‌వ్వుతూనే సెటైర్ పేల్చేశారు. దీంతో అల్లు అర‌వింద్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.