టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అయిపోతున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడుతోంది. ఇటు సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు చేస్తోంది. కానీ, సరైన హిట్ మాత్రం పడటం లేదు. కొందరైతే పూజా హెగ్డేను ఐరన్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు.
మరికొందరు పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ మాట అన్నవారికి తాజాగా పూజా హెగ్డే చెప్పు తెగేలా సమాధానం ఇచ్చింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డా బుట్టబొమ్మ టాలీవుడ్ లో ఓ బిగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ప్రముఖ డైరెక్టర్ పరుశురామ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి విధితమే.
`గీత గోవిందం` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం వీరిద్దరూ కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది. ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. అయితే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేశారట. ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తి అయ్యాయని అంటున్నారు. కాగా, తెలుగులో మహేష్ బాబుకు జోడీగా `గుంటూరు కారం` సినిమాలోనూ పూజా హెగ్డే నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో ఒకటి, రెండు ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది. మొత్తానికి వరుస ఫ్లాపుల్లోనూ పూజా హెగ్డే తగ్గేదేలే అంటోంది.