అక్క‌డ స్పీడ్‌ పెంచుతున్న కృతి శెట్టి.. మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్‌!?

గత ఏడాది నుంచి టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ కృతి శెట్టి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో మంచి జోరు చూపించిన ఈ భామ‌కు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాపులు పడుతున్నాయి. రీసెంట్గా కస్టడీ మూవీతో కృతి శెట్టి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు నిరాశే ఎదురయింది. దీంతో టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించిన కృతి శెట్టి.. కోలీవుడ్ లో స్పీడ్ పెంచుతుంది. అక్కడ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతోంది.

వెంకట ప్రభు, విజయ్ దళపతి కాంబోలో ఓ ప్రాజెక్టు సెట్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో కృతి శెట్టి ఒక హీరోయిన్ గా ఎంపిక అయిందని వార్తలు వస్తున్నాయి. అలాగే కోలీవుడ్‌ స్టార్ కార్తీతో జతకట్టే అవకాశం కృతి శెట్టి అందుకుందని అంటున్నారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఈ అందాల భామ‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. హీరో విశాల్ తో బేబమ్మ ఓ సినిమా చేయబోతోందట.

డైరెక్టర్ పాండిరాజ, విశాల్ కాంబోలో ఇంతకుముందు వచ్చిన `కథాకళి` చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. మళ్ళీ వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోంది. వచ్చే నెలలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో విశాల్ కు జోడీగా కృతిని సంప్రదించ‌గా.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్ర‌కటన వెలువడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తానికి వరుస ప్లాపుల కారణంగా టాలీవుడ్ లో ఫామ్ ను కోల్పోయిన కృతి శెట్టి.. కోలీవుడ్ అయినా స్టార్ హోదాను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.