టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాస మారింది..స్పీచ్లు మారాయి. మొన్నటివరకు ఆయన స్పీచ్లు పెద్ద ఉపన్యాసాలు మాదిరి ఉండేవి..ఏదో కాలేజీల్లో లెక్చర్ ఇస్తున్నట్లు ఉండేది. ఆయన స్పీచ్లు వినడానికి తెలుగు తమ్ముళ్లే పెద్ద ఆసక్తి చూపే వారు కాదు. అలా ఉండే బాబు స్పీచ్లు ఇప్పుడు మారుతున్నాయి. ప్రజలకు అర్ధమయ్యే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రతి అంశం ప్రజల్లోకి వెళ్ళేలా మాట్లాడుతున్నారు.
తాజాగా టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలతో బాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ నేతలపి సెటైర్ల వర్షం కురిపించారు. ఇళ్ల శాఖ మంత్రి తన నియోజకవర్గంలో పట్టుమని పది ఇళ్లు కట్టించలేదని, తన నియోజకవర్గంలో ఒక పిల్ల కాల్వ కూడా తవ్వించలేని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అని జోగి రమేష్, అంబటి రాంబాబులపై సెటైర్లు వేశారు.
రాష్ట్రానికి పరిశ్రమలు ఏవంటే కోడి గుడ్డు కథలు చెప్పే వ్యక్తి పరిశ్రమల మంత్రి అని, ఇక మైనింగ్ మంత్రి తనే అక్రమ మైనింగ్ చేయిస్తుంటాడని, అవినాశ్రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకోవాలని దేవదాయ మంత్రి యాగాలు చేయిస్తుంటారని, ఆర్థిక మంత్రికి అప్పులు తేవడం తప్ప మరో పని తెలియదని, పిల్లల జీవితాలను నాశనం చేసే వ్యక్తి విద్యా మంత్రి అని బాబు వరుసపెట్టి ఏపీ మంత్రులపై సెటైర్లు వేశారు. మళ్ళీ వీళ్ళంతా తన గురించి మాట్లాడతారని, జగన్ పత్రికలో పనిచేసేవాళ్ళు స్ర్కిప్ట్ రాసిస్తే చదవడం తప్ప ఈ మంత్రులకు ఏ సబ్జెక్టూ తెలియదన్నారు. ప్రతి రోజూ తనను తిట్టడం ఒకటే వాళ్లకు అప్పచెప్పిన పని.. తెలిసిన పని అని వ్యాఖ్యానించారు.
అయితే బాబు వేసిన సెటైర్లలో వాస్తవం ఉందని, ఇప్పుడున్న మంత్రులకు తమ శాఖలపై అవగాహన లేదని, కేవలం బాబు, పవన్ని మాత్రమే తిట్టడం తెలుసని అంటున్నారు. జగన్ తో సహ మంత్రులు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారని చెబుతున్నారు.