పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలన పోషించారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగా జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఆదిపురుష్ థియేట్రికల్ హక్కులను ఏకంగా రూ. 120 కోట్లకు కొనుగోలు చేశారు. మిగిలిన భాషల్లో కూడా ఆదిపురుష్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఆదిపురుష్ ఫలితాన్ని ముందే చెప్పేశారు. అడగకపోయినా సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణుస్వామి.. ఇప్పుడు ఆదిపురుష్ భవిష్యత్తు ఏంటో చెప్పేశారు.
ఆదిపురుష్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశం లేదు. బాహుబలి రేంజ్ లో ఊహించుకుంటే నిరాశ పడతారు. సినిమా జస్ట్ యావరేజ్గా ఆడుతుంది. మీడియం రేంజ్ లో కలెక్షన్లను రాబడుతుంది అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్కి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. రెండు సినిమాలు వచ్చాయి.. రెండూ పోయాయి. ఇప్పుడు ఆదిపురుష్ పరిస్థితి కూడా అంతే. దానికి కారణం ప్రభాస్ జాతక యోగమే అని వేణుస్వామి పేర్కొన్నారు. ఈయన వ్యాఖ్యలను ప్రభాస్ అభిమానుల్లో కొందరు ఖండిస్తుంటే.. జాతకాలు నమ్మేవారు మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. మరి ఆదిపురుష్ ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.