నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `భగవంత్ కేసరి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ బాబు తదితరలు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈ మూవీ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే.. రిలీజ్ కు నాలుగు నెలల ముందే `భగవంత్ కేసరి` ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేశారు. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం బాలయ్య నుంచి రాబోతున్న చిత్రం కావడంతో.. భగవంత్ కేసరి సినిమా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకోవడానికి ఓటీటీ సంస్థలు గట్టిగానే పోటీ పడ్డాయట. చివరికి అమెజాన్ ప్రైమ్ వారు రూ. 18 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బాలయ్య కెరీర్ లోనే హయ్యస్ట్ ఓటీటీ డీల్ గా చెప్పుకోవచ్చు.