ప్ర‌ముఖ ఓటీటీకి `ఆదిపురుష్‌`.. క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన డిజిట‌ల్ రైట్స్‌!?

ఆదిపురుష్‌.. మ‌రి కొద్ది రోజుల్లోనే ఈ మైథ‌లాజిక‌ల్ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సీతారాములుగా కృతి స‌న‌న్‌, ప్ర‌భాస్ న‌టించారు. అలాగే సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు.

జూన్ 16న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ఊపందుకున్నాయి. జూన్ 6న తిరుప‌తిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వ‌హించ‌బోతున్నాడు. మ‌రోవైపు ఊహించిన దానికంటే ఎక్కువ‌గా ఆదిపురుష్ బిజినెస్ జ‌రుగుతోంది.

తాజాగా ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ ను క‌ళ్లు చెదిరే ధ‌ర‌కు మేక‌ర్స్ విక్ర‌యించార‌ట‌. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఆదిపురుష్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ మొత్తానికి కొనుగోలు చేసింద‌ట‌. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషలూ కలిపి.. దాదాపు 250 కోట్లకు అమ్ముడుపోయిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. ఇక థియేట్రిక‌ల్ బిజినెస్ కూడా ఆదిపురుష్ కు భారీ స్థాయిలో జ‌రుగుతోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను ఏకంగా రూ. 185 కోట్ల‌కు కొనుగోలు చేశార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.