బాబుపై విజయసాయి ఆసక్తికర ట్వీట్..మారిపోయారు సార్..!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఇక సాయిరెడ్డి చేసిన ట్వీట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మీరు మారిపోయారు సర్ అంటూ కొందరు పెద్ద ఎత్తున ట్వీట్స్  పెడుతుంటే.. మీ నుంచి ఇది ఊహించలేదంటూ కొందరు.. మీరు ఇలాగే ఉండండి సార్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇటీవల తారకరత్న మరణించిన దగ్గర నుంచి సాయిరెడ్డిలో మార్పు బాగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. తారకరత్నకు చంద్రబాబు మావయ్య అవుతారనే సంగతి తెలిసిందే..అలాగే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి సాయిరెడ్డి బాబాయి అవుతారు.

దీంతో బాబు, సాయిరెడ్డిల మధ్య బంధుత్వం వచ్చింది..అలాగే తారకరత్న చనిపోయిన సమయంలో బాబు, సాయిరెడ్డి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. దశదిన కర్మ రోజు సైతం ఇద్దరూ కలిసే ఉన్నారు. ఇక అప్పటినుంచి సాయిరెడ్డి…బాబుని విమర్శించడం మానేశారు. గతంలో బాబుని టార్గెట్ చేసి సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో తిట్టే వారు…కానీ ఈ మధ్య కాలంలో అదేమీ లేదు.

అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో గాని, ఇప్పుడు వివేకా హత్య కేసు అంశంలో గాని సాయిరెడ్డి స్పందించలేదు. అసలు ఆయన రాజకీయాలపైనే స్పందించడం లేదు. మొత్తానికి ఆయనలో మార్పు ఎక్కువగా కనిపిస్తుంది…మరి ఈ మార్పు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.