ర‌వితేజ సాయాన్ని మ‌ర‌వ‌ని సునీల్‌.. ఫైన‌ల్ గా రుణం తీర్చేసుకున్నాడు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా కొన‌సాగుతూనే.. మ‌రోవైపు నిర్మాత‌గా స‌త్తా చాటాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్టీ టీమ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాల‌ను నిర్మిస్తున్నారు. తాజాగా ఈయ‌న నిర్మాణంలో తెర‌కెక్కిన చిత్ర‌మే `చాంగురే బంగారు రాజా`. `కేరాఫ్ కంచరపాలెం` నటుడు కార్తీక్ రత్నం ముఖ్యపాత్రలో కామెడీ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

సతీష్ వర్మ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో గోల్డీ నిస్సీ, రవిబాబు, సత్య, ఎస్తర్ నోరాన్హా, నిత్యశ్రీ త‌దిత‌రులు ముఖ్యపాత్రల్లో న‌టించారు. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ సినిమా టీజ‌ర్ బాగానే ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమాలో ప్ర‌ముఖ నటుడు సునీల్ కూడా భాగం అయ్యారు. ఇందులో ఓ కుక్క పాత్ర ఉంది. ఈ కుక్క పాత్రే సినిమా క‌థ‌ను నెరేట్ చేస్తుంది.

అయితే ఆ పాత్ర‌కు సునీల్ వాయిస్ అందించారు. గతంలో సునీల్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `మర్యాద రామన్న` సినిమాలో సైకిల్ క్యారెక్టర్ కి ర‌వితేజ వాయిస్ ఇచ్చి స్టోరీ నేరేటర్ గా మారిపోయారు. ఆ సినిమా సక్సెస్ లో సైకిల్ ద్వారా రవితేజ ఇచ్చిన స్టోరీ నేరేషన్ బాగా ప్ల‌స్ అయింది. అలా రవితేజ నుంచి పొందిన సాయాన్ని మ‌ర‌వ‌కుండా ఇప్పుడు సునీల్ రుణం తీర్చేసుకున్నాడు. ఆయ‌న‌ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఛాంగురే బంగారు రాజా మూవీలో కుక్క పాత్రకి వాయిస్ ఇచ్చి నేరేటర్ గా మారిపోయారు. మ‌రి ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.