తాగి మాట్లాడుతున్నావా అనేవారు.. యాక్సిడెంట్ త‌ర్వాత తేజ్‌ చేదు అనుభ‌వాలు!

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం `విరూపాక్ష‌`. కార్తీక్ దండు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఏప్రిల్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే తాజా మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాడు. అయితే తాజాగా జ‌రిగిన ఈ మీడియాలో స‌మావేశంలో.. తేజ్ బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత ఎదురైన చేదు అనుభ‌వాల‌ను పంచుకున్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింద‌ని.. ఆ సమయంలో మానసిక, శారీరక ఒత్తిడికి లోనయ్యాయ‌ని తేజ్ తెలిపాడు.

అలాగే సోషల్ మీడియాలో నా పనైపోయింద‌ని.. రిటైర్మెంట్ తీసుకున్నాన‌ని జోక్స్ వేశారు. ఆ జోక్స్ త‌న‌ను ఎంతో బాధ‌పెట్టాయ‌ని.. అయినా తానేమి కావాలని విరామం తీసుకోలేదు కదా అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఇక ప్రమాదం కారణంగా త‌న‌కు మాట పడిపోయింద‌ని, ఎప్పుడూ గలగలా మాట్లాడే త‌న‌ నోటి నుండి మాటలు రావడం కష్టమైంద‌ని తేజ్ వెల్ల‌డించాడు. తాను మాట్లాడుతుంటే ఎదుటి వాళ్లకు అర్థమయ్యేది కాద‌ని.. తాగి మాట్లాడుతున్నావా? అని ఎగతాళి చేసేవారని.. పేరెంట్స్, సన్నిహితుల మద్దతుతో తిరిగి మాట్లాడగలుగుతున్నానని తేజ్ అన్నారు. దీంతో ఈయ‌న వ్యాఖ్య‌లు కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.