అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్నా ఒకటి. ఈ కన్నడ సోయగం `ఛలో` మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. గీత గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని.. సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో `పుష్ప 2`, రణ్బీర్ కపూర్ తో `యానిమల్` మరియు ఇటీవల `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీకి సైన్ చేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక.. పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించినా ఆమెలో ఎంత వేదన ఉందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
`ఇప్పటికే హీరోయిన్ గా ఓ స్థాయికి వచ్చాను.. పలు అవార్డులు కూడా అందుకున్నాను.. కానీ నా పేరెంట్స్ మాత్రం నన్ను చూసి గర్వపడటం లేదు. నా విషయంలో సంతోషంగా లేరు. అందుకు నేను తరచూ వేదనకు గురవుతూనే ఉంటాను. అయితే నా తల్లిదండ్రులకు సినిమా రంగం గురించి ఏమి తెలియక పోవడమే అందుకు కారణం. నా వృత్తి గురించి వారికి పూర్తిగా అవగాహన లేదు. అయినాసరే నాకు అవసరమైనదంతా వారు చేసి పెడుతుంటారు. అలాగే నా కెరీర్ ఆరంభంలో వారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే నా పేరెంట్స్ ను గర్వపడేలా మరింత సాధించాలని అనుకుంటున్నాను` అని తెలిపింది.