అఖిల్ ఏజెంట్ సినిమాకు అండగా ప్రభాస్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా రెబెల్ స్టార్

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అక్కినేని అఖిల్ కొత్త సినిమా ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందింది. ఈ సినిమాను కిక్ వంటి హిట్ సినిమాలు తీసిన అగ్ర దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య నటించింది. ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా అక్కినేని అభిమానులు చాలా ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తమ అభిమాన హీరోకు భారీ హిట్ అందిస్తుందని చాలా నమ్మకంగా ఫ్యాన్స్ ఉన్నారు. వారికి మరింత జోష్ ఇచ్చే ఇంట్రస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించి ప్రభాస్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

అఖిల్‌ను పాన్ ఇండియా హీరోగా మార్చాలని నాగార్జున ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సరికొత్త స్పై థ్రిల్లర్ కథాంశంతో ఏజెంట్ సినిమా తెరకెక్కింది. సీనియర్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండడం, కిక్ వంటి ఎంటర్‌టైనర్ రూపొందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడం వంటివి ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనికి తోడు త్వరలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్‌ను చీఫ్ గెస్ట్‌గా తీసుకురానున్నారు.

ఇదే నిజమైతే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రత్యేక హైప్ వస్తుంది. బాహుబలి, సాహో వంటి సినిమాలను ఆయనను హిందీ ప్రేక్షకులకు చేరువ చేశాయి. ఇక బాహుబలి సినిమాను అన్ని భాషల సినీ అభిమానులు ఆదరించారు. అలాంటి హీరో ఈ సినిమా ఈవెంట్‌కు వస్తే దీనికి మరింత హైప్ వస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది నిజం కావాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.