చిరంజీవి హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మాణంలో విలక్షణ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చూడాలని ఉంది సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో కలకత్తా నేపథ్యంలో వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రధానంగా చిరంజీవి రైల్వేస్టేషన్లో హీరోయిన్ అంజలా ఝవెరీకి లైన్ వేసే సన్నివేశం ఎంతో మెమొరబుల్ గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సన్నివేశం గురించి తాజాగా దర్శకుడు గుణశేఖర్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
“చిరంజీవి గారికి డైలాగులు లేకుండా కేవలం హీరోయిన్ ను చూస్తూ ఉండే లవ్ సీన్ అది. అంతకు ముందే పవన్ కళ్యాణ్ గారు తొలిప్రేమ తో ఒక ఊపు ఊపేశారు. దీంతో అందరూ పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన సీన్ చిరంజీవి గారితో చేస్తున్నాడేంటి ? అనుకునే వాళ్ళు. అంత యూత్ ఫుల్ సీన్ అది. అందుకే ఆ సీన్ కోసం చాలా కష్టపడ్డాను.
ఈ సన్నివేశంలో ప్రతి కదలికను పక్కా ప్లాన్ తో పేపర్ పై స్కెచ్ వేసుకుని మరి స్క్రీన్ ప్లే రాసుకొని ఎంతో కష్టపడి చిత్రీకరించేందుకు సిద్ధమయం.. ఈ సీన్ షూటింగ్ కు ఒరిజినల్ లొకేషన్ కావాలని నిర్మాత దత్ గారితో అన్నాను. చిరంజీవి వంటి స్టార్ హీరోతో ఒరిజినల్ రైల్వే స్టేషన్ లో షూటింగ్ ఎలా అంటూ ఆయన నాపై కోపడ్డారు. నేను పట్టుబట్టడంతో నాంపల్లి.. కాచిగూడ రైల్వే స్టేషన్స్ లో షూటింగ్ ఏర్పాటు చేశారు.
ఒక రోజు నాంపల్లి.. మరోరోజు కాచిగూడ రైల్వే స్టేషన్లో షూటింగ్ పూర్తి చేశాం. రెండు రోజులు రైల్వే స్టేషన్లో జనాలను కంట్రోల్ చేయడానికి అశ్వినీదత్ గారే కర్రపట్టుకుని మరీ ఉండాల్సి వచ్చింది. ఆ షూటింగ్ కారణంగా ఎంతో మంది ఎక్కాల్సిన రైలు కూడా మిస్ చేసుకున్నారు. ఎంతో కష్టపడ్డాం అందుకే ఆ సీన్ అంత బాగా వచ్చింది.” అంటూ ట్రైన్ సీన్ గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు గుణశేఖర్.