గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న న్యాచురల్ స్టార్ నాని `దసరా` మూవీతో బాక్సాఫీస్ వద్ద తన దాహాన్ని తీర్చేసుకున్నాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే.. దీక్షిత్ శెట్టి కీలక పాత్రను పోషించాడు.
విలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే రివేంట్ డ్రామా ఇది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారం రేపుతోంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం మంచి లాభాలతో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
అదేంటంటే.. దసరా సినిమాకు ఫస్ట్ చాయిస్ నాని కాదట. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఈ కథను రచించిన తరువాత రామ్ చరణ్ తో తీయాలని అనుకున్నాడట. కానీ, అంత పెద్ద హీరోకు కథ చెప్పి మెప్పించేందుకు సాహసం చాలలేదట. దాంతో సుకుమార్ సలహాతో నితిన్ వద్దకు వెళ్లి కథ వినిపించాడట. అయితే నితిన్ కు కథ నచ్చినప్పటికీ.. కొత్త డైరెక్టర్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందోనని రిజెక్ట్ చేశాడట. చివరకు నానికి కథ నచ్చడం, సినిమా చేయడం, బ్లాక్ బస్టర్ కొట్టడం చకచకా జరిగిపోయాయి. ఇక ఈ సినిమాతో నాని మంచి కంబ్యాక్ ఇచ్చాడు. దసరాతో తన సత్తా ఏంటో అందరికీ చూపించాడు.