చిరంజీవికి సంబంధం ఏంటి.. బుద్ధి లేదా.. `ఆర్ఆర్ఆర్‌` నిర్మాత ఘాటు వ్యాఖ్య‌లు!

భార‌త్ కు ఎన్నో ఏళ్ల నుంచి క‌ల‌గా మిగిలిన ఆస్కార్ `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో సాకారం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంగా ఆస్కార్ ను అందుకుంది. దీంతో డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, హీరోలు ఎన్టీఆర్‌-రామ్ చ‌ర‌ణ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి, గేయ రచయిత చంద్ర‌బోస్‌, సింగ‌ర్స్‌, కొరియోగ్రాఫ‌ర్ ఇలా అంద‌రి పేర్లు మారుమోగిపోతున్నాయి.

కానీ, `ఆర్ఆర్ఆర్‌`ను నిర్మాత దాన‌య్య‌ను మాత్రం అంద‌రూ మ‌ర‌చిపోయారు. దీంతో రాజ‌మౌళి, దాన‌య్య మ‌ధ్య విభేదాలు ఏర్ప‌డ్డాయ‌ని.. అందుకే ఆర్ఆర్ఆర్ టీమ్ ఆయ‌న్ను దూరం పెట్టార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఈ విష‌యంపై ఆయ‌న స్పందించారు. తనని ఎవరూ దూరం పెట్టలేదు అని.. త‌న‌కు పబ్లిసిటీపై ఆసక్తి లేదు కాబట్టి ఆస్కార్స్ లో ఇన్వాల్వ్ కాలేదని దానయ్య క్లారిటీ ఇచ్చారు.

ఈ క్ర‌మంలోనే మ‌రో రూమర్‌పై ఆయ‌న స్పందించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు నిర్మాత దానయ్య అయినప్పటికీ.. మ‌నీ ఇన్వెస్ట్ చేసింది మొత్తం మెగాస్టార్ చిరంజీవే అంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యంపై దాన‌య్య ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. త‌న సినిమాతో చిరంజీవికి సంబంధం ఏంటి.. ఇలాంటి అస‌త్య ప్ర‌చారం చేసేవారికి బుద్ధి ఉందా లేదా అంటూ ఫైర్ అయ్యారు. చిరంజీవి గారు కావాలంటే ఆయన సొంత చిత్రాలకి డబ్బు పెట్టుకుంటారు కదా.. ఆయనకే నిర్మాణ సంస్థ ఉంది కదా.. అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన ప్రమేయం ఎందుకు ఉంటుంది. కామన్ సెన్స్ లేనివాళ్లే ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు అంటూ దాన‌య్య తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తి చేశారు.