యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సర్ప్రైజ్ చేసింది. ఎన్టీఆర్ పిల్లలు నందమూరి అభయ్ రామ్, భార్గవ్ రామ్లకు దుస్తులను పంపించింది. యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేసి.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో చెరో బ్యాగ్కు ట్యాగ్ లు పెట్టి పంపించింది.
అలియా భట్ గొప్ప నటి మాత్రమే కాదు సక్సెస్ ఫుల్ బిజినెస్ వుమెన్ కూడా. 2022లో తాను గర్భిణిగా ఉన్న సమయంలోనే చిన్నారుల కోసం ఎడ్ – ఎ – మామా పేరిట దుస్తుల విక్రయం మొదలుపెట్టింది. ఏడాదిలోనే కంపెనీ విలువ రూ.150 కోట్ల మార్కును దాటడం విశేషం. అయితే అప్పడప్పుడు తన స్నేహితులైన నటీనటులకు మంచి డ్రస్ లు గిఫ్ట్ లుగా పంపించడం ఆలియాకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా తారక్ పిల్లలకు మంచి దుస్తులను పంపింది.
దీంతో ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా అలియాకు థాంక్స్ చెబుతూ.. అభయ్, భార్గవ్ ముఖాలు చిరునవ్వుతో వెలిగిపోయాయని పేర్కొన్నాడు. అంతేకాదు త్వరలో తన పేరుతోనూ ఒక బ్యాగ్ చూడాలనుకుంటున్నట్లుగా లవ్లీ పోస్ట్ చేశాడు. అందుకు అలియా.. `నీ కోసం ఈద్ స్పెషల్ వేర్ సిద్ధం చేస్తానంటూ` స్వీట్ గా హార్ట్ సింబల్ తో రిప్లై ఇచ్చింది. కాగా, ఎన్టీఆర్-అలియా భట్ `ఆర్ఆర్ఆర్` మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది.