కనీ వినీ ఎరుగ‌ని రీతిలో `ఎన్టీఆర్ 30` లాంఛింగ్.. ముహూర్తం పెట్టేసిన మేకర్స్!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్ర‌మిది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ ఎంపిక అయింది. తెలుగులో ఈమెకు ఇదే తొలి చిత్రం కావ‌డం విశేషం. అయితే ఈ ప్రాజెక్ట్ ను ప్ర‌క‌టించి చాలా కాల‌మే అయినా.. ఇంత వ‌ర‌కు షూటింగ్ ప్రారంభం కాక‌పోవ‌డం ప‌ట్ల అభిమానులు అస‌హ‌నంతో ఉన్నారు. ఇక ఫ్యాన్స్ గోల భ‌రించ‌లేక రీసెంట్ గా ఎన్టీఆర్ ఫిబ్రవరిలో పూజా, మార్చిలో రెగ్యులర్ షూట్ అని వెల్లడించారు.

అయితే తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ లాంఛింగ్ కు ముహూర్తం పెట్టేశార‌ట‌. అన్నపూర్ణ స్టూడియోలో ఫిబ్ర‌వ‌రి 24న కనీ వినీ ఎరుగ‌ని రీతిలో `ఎన్టీఆర్ 30`ను లాంఛ్ చేయ‌బోతున్నారు. సౌత్ తో పాటు ప‌లువురు బాలీవుడ్ స్టార్స్‌ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాబోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు మేక‌ర్స్ చేస్తున్నార‌ట‌. లాంఛింగ్ ఈవెంట్ తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయాల‌న్న‌దే కొర‌టాల ప్లాన్ అని తెలుస్తోంది. ఇక మార్చి 20వ తేదీ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌బోతున్నార‌ని తెలుస్తోంది.