ఆ మాట‌ల‌ను త‌ట్టుకోలేక‌పోయా.. బాగా విసిగిపోయానంటూ జాన్వీ ఆవేద‌న‌!

అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ బ‌డా నిర్మాత బోనీ కపూర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అయితే ఈ స్టార్ కిడ్‌ తరచూ విమర్శలు, ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంది.

సక్సెస్ లేకపోయినా తండ్రి అండ దండలతో అవకాశాలను అందుకుంటుంది అంటూ నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్ విషయంలో ఆవేదన వ్యక్తం చేసింది. “ఎంత కష్టపడినా కొంద‌రు అందులో తప్పులు వెతుకుతూ విమర్శిస్తూనే ఉంటారు. ఎప్పుడూ సూటి పోటి మాటలతో బాధపెడతారు. నేను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు.

నెపోకిడ్‌ అంటూ కొందరు నన్ను త‌ర‌చూ ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. నా సినిమా రిలీజ్ అయినప్పుడల్లా `న‌ట‌న రాని నెపోకిడ్.. ఎందుకు సినిమాలు చేస్తున్నావు` అంటూ కామెంట్స్ చేస్తారు. మొద‌ట్లో వారి మాటలను తట్టుకోలేకపోయేదాన్ని. ట్రోల్స్ తో బాగా విసిగిపోయేదాన్ని. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ చూసి నవ్వుకుంటున్నా. నా బ‌లాలు, బలహీనతలు, నేను ఎలా నటిస్తున్నాను నాకు తెలుసు. కాబట్టి విమ‌ర్శ‌కుల వ్యాఖ్యలు పట్టించుకోను` అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. దీంతో జాన్వీ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.