ఇట్స్ అఫీషియ‌ల్‌.. `వారసుడు` వాయిదా.. ఫుల్ ఖుషీలో చిరు, బాల‌య్య ఫ్యాన్స్‌!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ ద‌ళ‌ప‌తి, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ `వ‌రిసు(తెలుగు వార‌సుడు)`. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. శ‌ర‌త్‌కుమార్‌, శ్రీకాంత్‌, శామ్‌, సంగీత , జ‌య‌సుధ‌, ఖుష్బూ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే తెలుగు వెర్ష‌న్ జ‌న‌వ‌రి 11న విడుద‌లకావ‌డం అనుమాన‌మేన‌ని వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఆ వార్త‌లే నిజం అయ్యాయి. వార‌సుడు వాయిదా ప‌డింది. జ‌న‌వ‌రి 11న కాకుండా జ‌న‌వ‌రి 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

తాజాగా ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. ఈ న్యూస్ తెలిసి బాల‌య్య‌, చిరు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దిల్ రాజు `వార‌సుడు` కోసం బాల‌య్య `వీర సింహా రెడ్డి`, చిరంజీవి `వాల్తేరు వీరయ్య‌` చిత్రాల‌కు తెలుగు రాష్ట్రాల్లో థియేర‌ట్స్ ద‌క్క‌కుండా చేశాడు. చాలా చోట్ల థియేటర్స్ ని బ్లాక్ చేసి వారసుడు సినిమాని మాత్రమే రన్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు వార‌సుడు వాయిదా ప‌డ‌టంతో.. ఆ రెండు చిత్రాల‌కు థియేట‌ర్ల లాస్ త‌గ్గే అవ‌కాశం ల‌భించింది.