ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు.
గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను రాబట్టింది. అయితే ఇటీవల ఈ చిత్రాన్ని రష్యాలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రష్యాన్ భాషలోకి డబ్ చేసి డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని అక్కడ పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఇందుకోసం అల్లు అర్జున్, రష్మిక తో సహా పుష్ప టీమ్ రష్యాలో రెండు వారాల ముందు నుంచే భారీగా ఖర్చు పెట్టి ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
కట్ చేస్తే ఈ సినిమా రష్యాలో బొక్క బోర్లా పడింది. రష్యన్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కనీసం సినిమా టీం రష్యా కు వెళ్లేందుకు ఖర్చుపెట్టిన ఫ్లైట్ టికెట్స్ డబ్బులు కూడా ఈ సినిమాకు అక్కడ రాలేదంటూ టాక్ నడుస్తుంది. మొత్తానికి రష్యాలో రిలీజ్ చేసి పుష్ప మేకర్స్ గట్టిగానే చేతులు కాల్చుకున్నారని అంటున్నారు.