వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ నువ్వా-నేనా అంటూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా బాబీ `వాల్తేరు వీరయ్య` సినిమాను తెరకెక్కించగా.. బాలయ్యతో గోపీచంద్ మలినేని `వీర సింహారెడ్డి` మూవీని రూపొందించాడు. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. రెండిటిలోనూ శ్రుతిహాసనే హీరోయిన్గా నటించింది.
జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతుండగా.. జనవరి 13న వాల్తేరు వీరయ్య రాబోతోంది. దీంతో రెండు సినిమాల నుంచి పోటా పోటీగా అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. అయితే డిజిటల్ మీడియా ప్రచారంలో మాత్రం చిరునే జోరు చూపిస్తున్నారు. చిరు టీమ్ యమ యాక్టీవ్ గా ఉంటూ `వాల్తేరు వీరయ్య`కు సంబంధించి ప్రతీ అప్డేట్ ని నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. అలాగే ఇటీవల మెగా ఫ్యాన్స్ మేకర్స్ తో ప్రత్యేక ఫ్యాన్ మీట్ ని ఏర్పాటు చేసి ప్రమోషన్స్ పై చర్చలు జరిపారట. కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారట.
పైగా మెగా ఫ్యాన్స్ తో రవితేజ ఫ్యాన్స్ కూడా జతకట్టడంతో `వాల్తేరు వీరయ్య’ నుంచి వచ్చిన ప్రతీ అప్ డేట్ నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతోంది. కానీ, బాలయ్య టీమ్ మాత్రం ఈ విషయంలో బాగా వెనకపడ్డారు. దీంతో సోషల్ మీడియాలో వీరసింహా హవా కంటే వీరయ్య హవానే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రియులు బాలయ్య మేల్కోవయ్యా.. ఇప్పటికైనా పీఆర్ టీమ్ ను అలర్ట్ చేయవయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.