పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుక విడుదల చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆదిపురుష్ టీజర్ ను బయటకు వదలగా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే.
ప్రభాస్ అభిమానుల సైతం ఈ టీజర్ పై పెదవి వివరించారు. దీంతో విడుదల తేదీని వాయిదా వేసిన మేకర్స్.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయితే తాజాగా యంగ్ హీరో సినిమాను అడ్డుపెట్టుకుని `ఆదిపురుష్`పై నెటిజన్లు మళ్లీ ఏకేస్తున్నారు. యువ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో `హనుమాన్` అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే సోమవారం ఈ సినిమా టీజర్ లాంఛ్ చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టీజర్ వీఎఫ్ఎక్స్ నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. పరిమిత బడ్జెట్ తో రూపొందించినప్పటికీ.. క్వాలిటీ పరంగా ఈ మూవీ చాలా రిచ్గా ఉంది. దీంతో కొందరు నెటిజన్లు హనుమాన్ ముందు ఆదిపురుష్ దిగదుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్ కాదు ప్రజెంటేషన్ ముఖ్యం.. ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకో ఓం రౌత్ అంటూ నెటిజన్లు చురకలు వేస్తున్నారు. మొత్తానికి టీజర్ తోనే హనుమాన్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.