రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. పక్కనే ఉన్న నేతలు ఎసరు పెట్టిన సంద ర్భాలు చాలానే ఉన్నాయి. వైసీపీలో జగన్తో కలిసి మెలిసిన తిరిగిన కర్నూలుకు చెందిన రెడ్డి నాయకుడు టీడీపీలోకి వెళ్లి.. విమర్శల వర్షం కురిపించిన సందర్భాలు తెలిసిందే. సో.. పార్టీ ఏదైనా.. నాయకుల లక్షణం.. రాజకీయ లక్షణం.. అంతా వ్యక్తిగత ప్రయోజనం.. పదవులే! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే తరహా ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. తీవ్రంగా కనిపిస్తుండడమే.
రాష్ట్రంలో బీజేపీకి సోము వీర్రాజు చీఫ్గా ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన.. కన్నా లక్ష్మీనారాయణ నుంచి పగ్గాలు అందుకున్నారు. మంచి వాయిస్ ఉంది. కానీ, ఏం ప్రయోజనం.. అంటున్నారు సీనియర్ నేతలు. ఆయన బాగానే ఫైర్ అవుతున్నా.. సెగ మాత్రం కనిపించడం లేదు. అదేసమయంలో తాము అధికారంలోకి వస్తే రూ.50కే చీపు లిక్కర్ ఇస్తామని.. ప్రకటించిన సందర్భాలు.. ఆయనను నిజంగానే ఒక కమెడియన్ను చేశాయని.. సీనియర్లు ఇప్పటికీ గుసగుసలాడుతుంటారు. పైగా.. కీలకమైన కాపు, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల్లో సోము బలమైన ముద్ర వేసుకోలేక పోయారు.
“ఆయన మాట్లాడతారండీ.. ఎందుకు మాట్లాడరు. కానీ.. ఎంత మంది రిసీవ్ చేసుకున్నారన్నదే మా ప్రశ్న“ ఈ మాట.. బీజేపీ లో ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తోంది. పైగా.. జనసేనతో పొత్తు పొత్తు అనే సోము.. ఆ పార్టీని కొన్ని కొన్ని సందర్బాల్లో ఆహ్వానించకుండానే కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇది కూడా ఆయనపై మరకలు పడేలా చేసింది. ఇదే విషయాన్ని పవన్ కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. “ఎవరి మానాన వాళ్లు చేసుకుంటే పోతే.. మేం కూడా అలానే ఉంటాం“ అని వ్యాఖ్యానించారు. ఇది జరిగిన తర్వాత.. విశాఖలో ప్రత్యేకంగా సమావేశం పెట్టి పవన్ను ఆహ్వానించారు.
అయితే.. మనసులు కలవలేదు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ నేత.. సత్యకుమార్.. ఏపీ అధ్యక్ష పీఠంపై కన్నేశారని అంటున్నారు. అందుకే.. ఆయన పేరు తరచుగా.. సోము తర్వాత ఎవరు అంటే.. వినిపిస్తోంది. ఇటీవల ఆయన ప్రజా పోరు యాత్రల్లో.. సీఎం జగన్ను, వైసీపీ నేతలనుటార్గెట్ చేస్తున్నారు. ప్రముఖంగా మీడియాలోనూ నిలుస్తున్నారు.
జాతీయ స్తాయిలో ఆయన గుర్తింపునకు కూడా నోచుకుంటున్నారు. (వాస్తవానికి ఆయన జాతీయనేతే). దీంతో సోము ఇప్పటి వరకు చేసిందిపోయి..ఇప్పుడు సత్య చుట్టూ బీజేపీ రాజకీయాలు తచ్చాడుతున్నాయి. ఆయనకు అధ్యక్షపదవి ఇస్తే.. జగన్కు సరైన ప్రత్యర్థిని నిలబెట్టినట్టు అవుతుందనే సంకేతాలు వస్తున్నాయి. మొత్తానికి సోము కు సత్తెన్న ఎసరు పెడుతున్నాడనే అంటున్నారు పరిశీలకులు.