ఏపీ అధికార పార్టీ వైసీపీలో సగం మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు లేవా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్ నాయకులు.. ప్రస్తుతం ఈ చర్చ తాడేపల్లి వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకురాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. గడప గడపకు తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అనేక విమర్శలువస్తు న్నాయి. మొదట్లో లైట్ తీసుకున్నారు.
అంతేకాదు.. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర అని పేర్కొన్నప్పటికీ.. నిజాలు నెమ్మదిగా తెలుస్తున్నాయి. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ.. ఇలా.. ఉమ్మడి జిల్లాల్లో 70 నియో జవర్గాల్లో ఎమ్మెల్యేలకు భారీ సెగ కనిపిస్తోందని..అధిష్టానానికి తెలిసింది. మొదట్లో.. దీనిని కొట్టిపారేసినా.. ప్లీనరీ అనంతరం రెండో విడత ప్రారంభించిన గడప గడపకు కార్యక్రమంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ ఎదురుగాలి వీస్తోంది.
ఎమ్మెల్యేలపై ప్రజలు విరుచుకుపడడం.. వారిని నిలదీయడం.. అర్హులైన వారికి కూడా పథకాలు ఇవ్వ కుండా.. వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించడం.. వంటివి అధిష్టానానికి కోపం తెప్పించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఎమ్మెల్యేలకు చెక్ పెట్టాలనే దిశగా అధిష్టానం ఆలోచిస్తోందని సీనియర్లు చెబు తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ చెప్పినట్టు.. పనిచేయనివారికి చెక్ పెట్టడం ఖాయమని సీనియర్లు అంటున్నారు. అయితే.. ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో పెనుకొండ ఎమ్మెల్యే , మాజీ మంత్రి శంకరనారాయణ, గుంటూరులో పొన్నూరు, తెనాలి, విజయవాడ సెంట్రల్, విశాఖ భీమిలి.. ఇలా.. ఏకంగా 70 నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్లు ఇవ్వడం అంటే.. కోరి ఓటమిని కౌగిలించుకోవడమే అవుతుందని.. వీరికి ప్రజల్లో బలం తగ్గిపోయిందని.. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్నిచేసినా.. నాయకులు బలంగా లేకపోవడం సరికాదనేది అధిష్టానం ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలో 70 మంది స్తానంలో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.