ఏపీలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే నాలుగు పేర్లుఖరారు అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ప్రముఖ సినీ నటుడు ఆలీకి రాజ్యసభ ఇస్తారన్న ఓ ప్రచారం అయితే బయటకు వచ్చింది. జగన్ ఆలీకి నిజంగానే చోటు ఇస్తారా ? అసలు ఇప్పుడు ఈ వార్తలకు చోటు ఎందుకు అన్నది ఎవ్వరికి అంతు పట్టడం లేదు. గతంలో సినిమా వాళ్లను రాజ్యసభకు పంపడం అనేది టీడీపీ నుంచే ప్రారంభమైంది. రావుగోపాలరావు – మోహన్బాబు లాంటి వాళ్లు టీడీపీ నుంచే పెద్దల సభకు వెళ్లారు.
ఇప్పుడు వైసీపీ కూడా ఆ ఆనవాయితీని కంటిన్యూ చేస్తుందా ? లేదా ఆలీకి రాజ్యసభ కాకుండా మరో పదవి వస్తుందా ? అన్నది చర్చగానే ఉంది. సినిమా వాళ్లు సీఎంను కలిశాక ఆలీతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడడమే కాస్త ఉత్కంఠగా మారింది. దగ్గర్లోనే రాజ్యసభ వ్యవహారం ఉండడంతో ఇప్పుడు అందరూ ఆలీకి, రాజ్యసభ సీటుకు లింకులు పెడుతున్నారు.
జగన్ ఇప్పటికే మైనార్టీలకు నాలుగు ఎమ్మెల్సీలు ఇచ్చారు. మైనార్టీలకు ఇంకా ప్రాధాన్యం ఇచ్చి రాజ్యసభ కూడా ఇవ్వాలని అనుకుంటే చాలా మంది ఉన్నారు. సడెన్గా ఇప్పుడు ఆలీని తీసుకువచ్చి ఇంత పెద్ద పదవి ఇస్తారని అనుకోలేం. మైనార్టీ ఓట్ల కోసం జగన్ మరింతగా గురిపెడితే ఆలీని ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంచుతారు. ఆయనకు ఇక్కడే పదవి ఇస్తారని అంటున్నారు.
సినిమా వాళ్లలో జగన్ ఇప్పటి వరకు పృథ్వికి మాత్రమే పదవి ఇచ్చారు. ఆ పదవి కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమా వాళ్లకు పదవులు ఇవ్వాలంటే ఆలీ మాత్రమే కాదు.. పోసాని లాంటి వాళ్లు కూడా లైన్లో ఉన్నారు. ఇక జగన్కు బంధువు అయిన మోహన్బాబు కూడా ఉన్నారు. మరి జగన్ మనసులో ఎవరు ఉన్నారో ? ఆలీకి పదవీ యోగం ఉందా ? లేదా ? అన్నది త్వరలోనే తేలనుంది.