రాజమౌళి బిగ్ రిస్క్.. రూ. 180 కోట్లకు హామీగా సంతకం..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల అవుతుంది అన్న వేళ మరోసారి బ్రేక్ పడింది. ఇప్పటికే పలు సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా.. మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ సినిమా కోసం నిర్మాత దానయ్య ఏకంగా రూ. 450 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రం విడుదల చాలా సార్లు వాయిదా పడటంతో ఆయనకు వడ్డీల భారం ఎక్కువైందట. రెండు మూడు సార్లు బయ్యర్లు కూడా అడ్వాన్సులు ఇచ్చారు. వెంటనే సినిమా విడుదల చేయాలని బయ్యర్లు దానయ్యపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నారు కూడా. అయినా రెండుసార్లు సినిమా వాయిదా పడింది.

అటు ఈ సంక్రాంతికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ చేయాలని దానయ్య బలంగా ఫిక్స్ అయ్యాడు. కానీ.. తాజా పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే అనుకున్న స్థాయిలో వసూళ్లు రావని రాజమౌళి భావిస్తున్నాడట. అందుకే మరోసారి మూవీ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దానయ్యకు వడ్డీల బాధ మరింత పెరుగుతుంది. ఈ సినిమాపై దానయ్య రూ. 180 కోట్ల ఫైనాన్స్ తీసుకున్నాడు. ఆ ఒత్తిడి తీవ్రం కావడంతో రాజమౌళి ఆ భారం మోసేందుకు రెడీ అయ్యాడట. అంతేకాదు.. ఆ ఫైనాన్స్ కు తాను హామీగా ఉంటానని చెప్పాడట. ఇందుకోసం డాక్యుమెంట్స్ మీద సంతకాలు కూడా చేశాడట. మామూలుగానే పెద్ద సినిమాల నుంచి ఫైనాన్సియర్ల ఒత్తిడి పెద్దగా ఉండదు. డబ్బులు జాగ్రత్తగానే ఉంటాయనే నమ్మకం వారికి ఉంటుంది.

కానీ దానయ్య పడుతున్న టెన్షన్ తగ్గించేందుకే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంతో రాజమౌళి గతంలో ఎప్పుడూ తీసుకోని రిస్క్ తీసుకున్నట్లే చెప్పుకోవచ్చు. అటు తాజాగా ఆచార్య సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఈ సినిమా నిర్మాణ సంస్థపై ఉన్న ఒత్తిళ్లను తగ్గించేందుకు కొరటాల శివ కూడా ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు స్వయంగా చూసుకుంటున్నాడు.