పుష్ప టీంపై రెండు కేసులు … ఫ్యాన్స్ తీరుపై బన్నీ షాకింగ్ డెసిషన్ ..(వీడియో)

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ను కలిసేందుకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ వద్దకు భారీగా అభిమానులు తరలిరావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 17వ తేదీ విడుదల కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ను కలుస్తాడని మూవీ యూనిట్ అభిమానులకు సమాచారం ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ వద్ద అభిమానులతో అల్లుఅర్జున్ ఫోటోలు దిగేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అభిమానులను కలుసుకోవడానికి బన్నీ వస్తున్నట్లు తెలుసుతున్న ఫ్యాన్స్ సోమవారం సాయంత్రం అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు.

అయితే ఎన్ కన్వెన్షన్ దగ్గర అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుసుకున్న అల్లు అర్జున్ తన కార్యక్రమాన్ని ఉన్నట్టుండి రద్దు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నిరుత్సాహానికి గురై నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో అక్కడ తొక్కిసలాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్ కన్వెన్షన్ దగ్గర కార్యక్రమం నిర్వహించేందుకు ఐదు వందల మందికి మాత్రమే అనుమతి తీసుకున్నట్లు మాదాపూర్ ఇన్ స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. కానీ అక్కడికి సుమారు రెండు వేల మంది అభిమానులు రావడంతో.. తప్పుడు వివరాలతో అనుమతి తీసుకున్న పుష్ప ప్రొడక్షన్ మేనేజర్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.

ఇదే కాదు పుష్ప టీం పై మరో కేసు కూడా నమోదైంది. ఆదివారం పుష్ప సినిమా ప్రీ రిలీజ్ వేడుక యూసుఫ్ గూడ పోలీస్ బెటాలియన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి 5000 మందికి పాసులు ఇస్తామని, సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధి కిషోర్ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే ఈ వేడుకకు సుమారుగా 15 వేల మందికి పైగా అభిమానులు తరలి వచ్చారు. నిర్వాహకులు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోలేదు. దీంతో అక్కడ కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఒక దశలో అభిమానులు సెక్యూరిటీ గా వచ్చిన కొద్ది మంది పోలీసులను లెక్క చేయకుండా వారిని తోసుకుంటూ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో పోలీసులు అభిమానులను అదుపు చేయలేకపోయారు. కార్యక్రమం జరిగే వేదిక సమీపంలో కూడా అభిమానులు రెచ్చిపోయారు. కుర్చీలను విసిరి విసిరి కొట్టారు. దీనిపై ఎస్సై నరేష్ ఫిర్యాదు చేయడంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధి కిషోర్ పై కేసు నమోదు చేశారు.

 

https://twitter.com/BunnyNikhil214/status/1470372805363449857?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1470372805363449857%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F