ఖిలాడీ 3ర్డ్ సింగిల్ : కిర్రాక్ స్టెప్ లతో పిచ్చెక్కిస్తున్న మాస్ మహా రాజ్..!

క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఏ స్టూడియోస్, ఎల్ ఎల్ పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సింగిల్ సాంగ్స్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ సాంగ్ విడుదలైంది. ‘అట్టా సూడకే.. పిచ్చేక్కుతుంది ఈడుకే..’ అంటూ సాగే ఈ పాట మాస్ బాణీలో ఆకట్టుకునేలా ఉంది. రవితేజ తన హుషారైన స్టెప్పులతో ఎప్పటిలాగే అలరించాడు. శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ ఈ పాటకి హైలెట్ గా మారింది.కాగా ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. క్రాక్ సినిమాతో విజయాన్ని అందుకున్న రవితేజ, రాక్షసుడు భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రమేష్ వర్మ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఖిలాడీ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తనదైన స్టైల్ లో ఖిలాడీకి కూడా పాటలు ఇస్తున్నాడు.