పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పొడగు కాళ్ల సుందరి పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్, ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే నటించింది. అలాగే మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో కృష్ణం రాజు కనిపించనున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. నిన్న హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించి రాధేశ్యామ్ ట్రైలర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. `రాధేశ్యామ్ సినిమా తీయడానికి నాలుగేళ్లు పట్టింది.. కానీ కథ రాయడానికి ఏకంగా 18ఏళ్లు పట్టింది. ఫస్ట్ టైమ్ ఈ పాయింట్ని నేను మా గురువు చంద్రశేఖర్ యేలేటి వద్ద విన్నాను. 18 ఏళ్లు ఇండియాలోని పెద్ద పెద్ద రచయితలను పిలిపించి రాయించాం.
కానీ, కథకు కన్క్లూజన్ దొరకలేదు.. ముగింపు కుదరడం లేదు. ఆ సమయంలో యేలేటిగారు ‘ఇది జాతకాల మీద రాస్తున్నావ్.. ఎవరికి రాసి పెట్టుందో అని’ అన్నారు. ఇది ప్రభాస్గారికి రాసిపెట్టి ఉంది. ఈ కథకు సంబంధించిన పాయింట్ మా గురువు దగ్గర తీసుకొని ఒక ఫిలాసఫీని లవ్ స్టోరీగా చేసి, కథ రాసి వినిపించగా ప్రభాస్కు బాగా నచ్చింది. ఇక ఈ సినిమాలో ఫైట్స్ ఉండకపోయినా..అమ్మాయికీ, అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలుంటాయి.` అంటూ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ వ్యాఖ్యలతో సినిమాసై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి. ఏదేమైనా 18 ఏళ్ల పాటు ఒక సినిమా కథ రాయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి.