యంగ్ స్టార్ హీరో సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ..హీరో ఎవరంటే..!

అలనాటి నటి శ్రీదేవి తెలుగునాట అతిలోకసుందరి గా పేరు తెచ్చుకొని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లోనూ ప్రభంజనం సృష్టించింది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హిందీ లో హీరోయిన్ గా పరిచయమైన వరుసగా విజయాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే జాన్వీకపూర్ ఇంతవరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. తెలుగులో నటించాలని పలువురు అగ్రహీరోలు నిర్మాతలు ఆమెను సంప్రదించినప్పటికీ ఎందుకో ఆమె అంగీకరించలేదు. అయితే ఈ సారి మాత్రం జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అనే మాట వినిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ముందుగా ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ భావించినప్పటికీ ఆ స్థానంలో జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కి సంబంధించి ఇప్పటికే ఈ సినిమా మేకర్స్ ఆమెతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బోనీ కపూర్ కూడా తన కూతురిని సౌత్ లో పరిచయం చేయాలని కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా ద్వారా అది సాధ్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతాగ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుండటం తో అటు అభిమానుల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన ఈ సినిమాను పూర్తి చేయడంతో అతి త్వరలోనే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.