రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ పోటీ ఓ రేంజ్లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే అందులోనూ భారీ క్రేజ్ ఉన్న రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుదలైతే.. ఇక వార్ ఏ రేంజ్లో ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇప్పుడు అలాంటి తరుణమే రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన `రాధేశ్యామ్` చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది.
ఈ చిత్రానికి సరిగ్గా వారం రోజుల ముందు అంటే జనవరి 7న ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం రిలీజ్ కానుంది. ఈ రెండూ పెద్ద చిత్రాలు. మరియు రెండూ ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కినవే. దీంతో సహజంగానే ఈ రెండు సినిమాలకు మధ్య పోటీ ఉంటుంది.
ఈ ప్రశ్నే దర్శకుడు రాజమౌళికి కూడా ఎదురైంది. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ల మధ్య పోటీ ఉంటుందా..? అని తాజాగా ఆయన్ను ప్రశ్నించగా.. అందుకు జక్కన్న ‘సినిమాల మధ్య పోటీ అనేది గతంలో కూడా ఉంది. సినిమాలు ఎన్ని విడుదలైనా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరిస్తారు. ఇందలో పోటీ అనుకోవడానికి ఏం లేదు. మా సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా బాగా రాణించాలని కోరుకుంటున్నాము` అంటూ కూల్ రిప్లై ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.