పూజా హెగ్డే.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ తర్వాత పూజా వెనక్కి తిరిగి చూసుకోలేదు.
రంగస్థలం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ పొడుగు కాళ్ల సుందరి తాజాగా ట్విట్టర్ వేదికగా తన ఫాలోవర్స్తో ముచ్చట్లు పెట్టింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన రకరకాల ప్రశ్నలకు తనదైన శైలిలో పూజా సమాధానం ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఓ నెటిజన్ భవిష్యత్లో ఎవరితో కలిసి నటించడం మీ కల? అని ప్రశ్నించగా.. టక్కున బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్తో నటించడమే నా కలంటూ చెప్పుకొచ్చింది. ఏదో ఒక రోజు ఆ కల నెరవేతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. మరి పూజా కల నెరవేరుతుందో..లేదో..చూడాలి.
అలాగే రాధేశ్యామ్ ఓ ఎపిక్ లవ్ స్టోరీ అని, అద్భుతమైన విజువల్స్ ఉంటాయని తెలిపింది. తమిళ హీరో విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టమని, ఆయన స్వీటెస్ట్ పర్సన్ అని పేర్కొంది. అలాగే, కన్నడ ఇండస్ట్రీని కేజీఎఫ్ హీరో యశ్ గర్వించేలా చేశాడని, ఎన్టీఆర్ రియల్గా ఉంటారని పూజా చెప్పుకొచ్చింది.