వేల నామినేషన్లన్నారు.. చివరకు 61 మాత్రమే వేశారు

ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వేల మందితో నామినేషన్లు వేయిస్తాం.. ప్రభుత్వానికి మా సత్తా చూపుతాం అంటూ పలువురు నాయకులు, ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లు గతంలోపేర్కొన్నారు. అందరూ.. నామినేషన్ వేస్తే బ్యాలెట్ పేపర్ కాదు కదా.. బ్యాలెట్ బుక్ తయారు చేయాలని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. తీరా ఎన్ని నామినేషన్లు దాఖలు చేశారంటే.. కేవలం 61 మాత్రమే. అదీ చివరి రోజే ( శుక్రవారం) 46 దాఖలు కాగా 7వ తేదీ ముందు వరకు 15 దాఖలయ్యాయి. మరో ముఖ్యవిషయమేమంటే.. ఈ 61 నామినేషన్లలో ఉండేదెందరో? పోటీ చేసేవారెందరో? ఎందుకంటే ఇంకా ఉపసంహరణకు కూడా గడువు ఉంది కదా. సాధారణంగా ప్రతి అభ్యర్థి తరపున డమ్మీ అభ్యర్థి నామినేషన్ వేస్తాడు. పొరపాటు జరిగే ప్రధాన క్యాండిడేట్ నామినేషన్ తిరస్కరణకు గురైతే డమ్మీ అభ్యర్థే మెయిన్ క్యాండిడేట్ అవుతాడు. ఇక వాహనాల కోసం ప్రధాన పార్టీలే కొందరిని బరిలోకి దింపుతాయి. ఎందుకంటే ప్రచారంలో వాహన పరిమితి ఉంటుంది కాబట్టి.. ఈ సమీకరణాలన్నీ ముగిసే సమయానికి కొందరైనా ఉపసంహరించుకుంటారు.

నిరసనకారులెందుకో మౌనం వహించారు

హుజూరాబాద్ ఎన్నికలను అస్త్రంగా ఉపయోగించుకుంటామని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ప్రకటించిన నాయకులు ఇపుడెందుకో మౌనంగా ఉండిపోయారు. వేలమందితో నామినేషన్ వేస్తామని చెప్పారే గానీ ఆ మేరకు చర్యలు తీసుకోలేకపోయారు. కేవలం ప్రతికా ప్రకటనలకే పరిమితమయ్యారు. వైటీపీ అధినేత షర్మిల కూడా నిరుద్యోగులచే నామినేషన్ వేయిస్తామని ప్రకటించింది. మరి వైటీపీ ఈ ఎందుకో వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నాయని చెప్పే నాయకులు. . ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నమే చేయలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.